Pakistan: పాక్‌లో ఆగని ఉగ్రవాదుల హత్యలు.. హఫీజ్‌ సయీద్‌ అనుచరుడి కాల్చివేత

Pakistan: పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.

Published : 06 Dec 2023 13:33 IST

ఇస్లామాబాద్‌: వరుసగా జరుగుతున్న హత్యలతో పాకిస్థాన్‌ (Pakistan) ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గత కొంతకాలంగా కీలక ఉగ్ర నేతలు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. తాజాగా లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ అనుచరుడిని కొందరు వ్యక్తులు కాల్చిచంపారు.

కరాచీలో డిసెంబరు 2వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సయీద్‌ అనుచరుడు హంజ్లా అద్నన్‌ తన ఇంటి బయట ఉండగా.. కొందరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అద్నన్‌ను పాక్‌ ఆర్మీ రహస్యంగా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ చికిత్స పొందుతూ అద్నన్‌ మంగళవారం చనిపోయినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్‌.. వీడియో వైరల్‌

2015లో జమ్మూకశ్మీర్‌లోని ఉదంపుర్‌లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి అద్నన్‌ సూత్రధారి. ఆ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అమరులవ్వగా.. మరో 13 మంది గాయపడ్డారు. ఇక, 2016లో కశ్మీర్‌లోని పాంపోర్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో 8 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై భారత ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అద్నన్‌ తన కార్యకలాపాలు సాగించేవాడని, భారత్‌లోకి ముష్కరులను పంపిస్తూ దాడులు చేయించాడని నిఘా వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా.. పాక్‌లో గత కొన్ని నెలలుగా వరుసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. ఈ వరుస హత్యలతో లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్‌కు కూడా భారీ దెబ్బలు తగిలాయి. ఈ ముఠా అధినేతల దగ్గరి అనుచరులు, టాప్‌ కమాండర్లను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. దీంతో ఈ ఉగ్రమూకలకు భయం పట్టుకుంది. చాలా మంది రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వరుస హత్యలతో పాక్‌ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక ప్రత్యర్థులు, ఇతర ఉగ్ర గ్రూపుల పాత్ర, అంతర్గత విభేదాల వంటి కోణాలను పరిశీలిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు