Lufthansa: వేల అడుగుల ఎత్తులో విమానంలో కుదుపులు.. ప్రమాద దృశ్యాలు తొలగించాలన్న సిబ్బంది

లుస్తాన్సా (Lufthansa) సంస్థకు చెందిన విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రమాదానికి గురైంది. భారీ కుదుపులు ఏర్పడి ఒక్కసారిగా 4 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. అప్రమత్తమైన పైలట్లు డల్లాస్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

Published : 13 Mar 2023 01:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జర్మనీ (Germany)కి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా (Lufthansa)కి చెందిన విమానం ప్రమాదానికి గురైంది. 37 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం.. సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా 4 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. దీంతో విమానంలో భారీగా కుదుపులు ఏర్పడ్డాయి. ఆహార పదార్థాలన్నీ క్యాబిన్‌లో చెల్లాచెదురైపోయాయి. అప్రమత్తమైన పైలట్లు అత్యవసరంగా వాషింగ్టన్ డీసీలోని డ్యులెస్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రంగా గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. మార్చి 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అయితే, విమానం అదుపుతప్పిన తర్వాత కుదుపులు ఏర్పడిన సమయంలో లోపల ఉన్న ప్రయాణికులు ఫొటోలు, వీడియోలు తీశారు. విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అయిన తర్వాత అందులోని సిబ్బంది ప్రయాణికుల ఫోన్లలోని ఫొటోలను, వీడియోలను తొలగించాలంటూ రెండు సార్లు అనౌన్స్‌ చేసినట్లు ఇన్‌సైడర్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది. కానీ, ప్రయాణికులు వ్యతిరేకించినట్లు చెప్పింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. మార్చి 1న లుప్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన A330-300 విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్‌ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు పయనమైంది. దాదాపు 37 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత విమానంలో ఒక్కసారిగా భారీ కుదుపులు ఏర్పడ్డాయి. విమానం అదుపుతప్పి కిందికి పడిపోతోందన్న సంగతి ప్రయాణికులకు అర్థమైంది. కొందరు ప్రయాణికులు విమానంలో ఆహారపదార్థాలు, చిన్నపాటి వస్తులు చెల్లాచెదురవ్వడాన్ని తమ కెమెరాల్లో బంధించారు. 

అంతలోనే విమానం 4 వేల అడుగులకు చేరుకుంది. దీంతో పైలట్లు వాషింగ్టన్‌ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చి.. అత్యవసరంగా అక్కడ ల్యాండ్‌ చేశారు. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రయాణికులు బయటకి వెళ్లే ముందు అందులోని సిబ్బంది.. మొబైల్స్‌లోని ఫొటోలు, వీడియోలు తొలగించాలని కోరడం వివాదాస్పదమైంది. విమాన సిబ్బంది ప్రకటనపై కొందరు ప్రయాణికులు మండిపడ్డారు. ‘‘ అసలు మేం మీకు ఎలా కనిపిస్తున్నాం?’’ అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇన్‌సైడర్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇలా ఫొటోలు, వీడియోలు తొలగించాలని చెప్పడం ప్రయాణికుల గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని తెలిపింది. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం లుఫ్తాన్సా ఇప్పటి వరకు వెల్లడించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని