Modi-Meloni Selfie: మోదీ, మెలోనీ ‘మెలోడీ’ సెల్ఫీ చూశారా..?

Modi-Meloni Selfie: ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దిగిన సెల్ఫీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Updated : 02 Dec 2023 16:19 IST

ఇంటర్నెట్ డెస్క్: వివిధ సదస్సుల్లో భాగంగా అంతర్జాతీయ వేదికలపై ప్రపంచనేతలు సమావేశం అవుతుంటారు. ఆ సందర్భంగా రాజకీయ, భౌగోళిక, ఆర్థిక అంశాలు చర్చకు వస్తుంటాయి. అదే సమయంలో వారు దిగే చిత్రాలు, వారిమధ్య చోటుచేసుకునే సరదా సంభాషణలు వైరల్‌ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ(Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ(Giorgia Meloni) దిగిన సెల్ఫీ తాజాగా నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ‘కాప్‌28’ ప్రపంచ వాతావరణ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, జార్జియా మెలోనీ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఓ సెల్ఫీ తీసుకున్నారు. ‘గుడ్‌ ఫ్రెండ్స్‌’ అంటూ  జార్జియా ఎక్స్‌(ట్విటర్)లో ఆ చిత్రాన్ని షేర్ చేశారు. అలాగే మెలోడీ(ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. దాంతో వెంటనే ఈ చిత్రం వైరల్ అయింది.  #Melodi నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోంది. కొద్దిగంటల వ్యవధిలోనే దీనిని కోటిమందికి పైగా వీక్షించారు. లక్షల్లో లైక్‌లు వచ్చాయి.

అటు ప్రధాని మోదీ కూడా ఈ ఫొటోపై స్పందించారు. ‘స్నేహితుల్ని కలుసుకోవడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంద’ని మెలోనీ పోస్టుకు బదులిచ్చారు. ఈ ఏడాది మన దేశంలో జరిగిన జీ20 సదస్సులో భాగంగా ఈ ఇద్దరు నేతలు సమావేశమై.. ఆత్మీయంగా పలకరించుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని