North Korea: కిమ్‌కు ఎదురుదెబ్బ.. విఫలమైన నిఘా ఉపగ్రహ ప్రయోగం..!

ఉత్తర కొరియా నిఘా ఉప్రగ్రహ ప్రయోగం టెన్షన్‌కు దారి తీసింది. ఈ ప్రయోగం విఫలం కావడంతో శకలాలు సముద్రంలో కుప్పకూలాయి. 

Published : 31 May 2023 10:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా (North Korea) తొలిసారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం తీవ్ర భయాందోళనలకు కారణమైంది. ఈ ప్రయోగం విఫలం కావడంతో ఆ రాకెట్‌, ఉపగ్రహ శకలాలు ఎక్కడొచ్చి మీద పడతాయోనని దక్షిణ కొరియా (South Korea) వణికిపోయింది. ఉత్తరకొరియా అధికారిక న్యూస్‌ఏజెన్సీ ఈ ప్రయోగం విఫలమైన విషయాన్ని నేడు వెల్లడించింది. ఉపగ్రహాన్ని తీసుకెళుతున్న రాకెట్‌ తొలి, రెండో దశల సమయంలో థ్రస్ట్‌ను కోల్పోయినట్లు పేర్కొంది. తమ శాస్త్రజ్ఞులు ఈ వైఫల్యానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నారని తెలిపింది. ఈ శకలాలు కొరియా ద్వీపకల్పంలోని ఉత్తరం వైపు సముద్ర జలాల్లో పడినట్లు వెల్లడించింది. కిమ్‌ సైనిక విస్తరణ చర్యలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ.

బుధవారం ఉదయం 6.29 సమయంలో ఉ.కొరియాలోని ఈశాన్య ప్రాంతంలోని తాంగ్‌ఛాంగ్‌-రీ లోని ప్రధాన అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రాకెట్‌ కూలిపోయే సమయంలో అసాధారణ గమనంలో ప్రయాణించిందని వెల్లడించారు. దీనిపై అమెరికాతో సమన్వయం పెంపొందించుకొన్నట్లు తెలిపారు. కొన్ని రాకెట్‌ శకలాలను కూడా దక్షిణ కొరియా స్వాధీనం చేసుకొంది. మరోవైపు జపాన్‌ స్పందిస్తూ.. ఏ వస్తువు కూడా అంతరిక్ష కక్ష్యలోకి చేరుకోలేదని వెల్లడించింది.

ద.కొరియా, జపాన్‌లో అత్యవసర చర్యలు..

ఉత్తరకొరియా రాకెట్‌ ప్రయోగించిన విషయం తెలియగానే దక్షిణ కొరియా, జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. సియోల్‌ ప్రజలకు స్పీకర్లలో, ఫోన్‌ సందేశాల ద్వారా హెచ్చరించింది. మరోవైపు జపాన్‌ ఒకినావాలో క్షిపణి హెచ్చరిక వ్యవస్థను సిద్ధం చేసింది. ఈ ప్రాంతం ఉత్తరకొరియా రాకెట్‌ గమనమార్గంలో ఉండటంతో ఈ చర్యలు తీసుకొంది. ప్రజలను భవనాలు, అండర్‌గ్రౌండ్‌ల్లోకి వెళ్లమని హెచ్చరికలు జారీ చేశారు.

ఉత్తరకొరియా ప్రయోగాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది ఐరాస ఆంక్షలకు వ్యతిరేకంగా బాలిస్టిక్‌ క్షిపణి టెక్నాలజీని ఉపయోగించడమే అని పేర్కొంది. దీనిపై జాతీయ భద్రతా సలహా మండలి ప్రతినిధి ఆడమ్‌ హోడ్స్‌ మాట్లాడుతూ అధ్యక్షుడు జో బైడెన్‌, నేషనల్‌ సెక్యూరిటీ టీమ్‌ అమెరికా మిత్రదేశాలు, భాగస్వాములతో సమన్వయం చేసుకొంటున్నారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని