USA: కొత్త ప్రభుత్వంతో చర్చలకు త్వరలో న్యూదిల్లీకి అమెరికా ప్రతినిధి

భారత్‌లోని కొత్త ప్రభుత్వంతో సంబంధాలు బలోపేతం చేసుకొనేందుకు అమెరికా యత్నాలు మొదలుపెట్టింది. 

Published : 06 Jun 2024 11:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల  కోసం అమెరికా ప్రయత్నాలను మొదలుపెట్టింది. తమ దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) జాక్‌ సలీవాన్‌ను భారత్‌ పంపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రకటించింది. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫోన్‌ చేసిన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చింది. ‘‘బైడెన్‌ నేడు ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా త్వరలో జాతీయ భద్రతా సలహాదారు న్యూదిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చింది. కొత్త ప్రభుత్వంతో భారత్‌-అమెరికా ప్రధాన్యాలపై చర్చించనున్నారు. వీటిల్లో సాంకేతిక భాగస్వామ్యం, వ్యూహాత్మక బంధం, పరస్పర విశ్వాసం వంటి అంశాలు ఉండనున్నాయి’’ అని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది. 

అమెరికా ఎన్‌ఎస్‌ఏ పర్యటన తేదీలను తర్వలోనే ప్రకటించనున్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ పర్యటన చోటు చేసుకోనుంది. ఇక అమెరికాలోని కీలక నాయకులు కూడా ప్రధానికి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. సెనెట్‌ ఫారెన్‌ రిలేషన్స్‌ కమిటీ ఛైర్మన్‌ బెన్‌ కార్డిన్‌ భారత ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఎండలను లెక్కచేయకుండా భారత ప్రజలు ఓట్లు వేసి ప్రజాస్వామ్య విధానాలపై ఉన్న గౌరవాన్ని చాటుకొన్నారు. రానున్న సంవత్సరాల్లో ప్రపంచాన్ని సుసంపన్నం చేసేందుకు భారత్‌-అమెరికా భాగస్వామ్యం మరింత బలపడుతుంది’’ అని పేర్కొన్నారు. 

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీకి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్‌ చైనా సహా పలు ప్రపంచ దేశాలు అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలంతా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు. ‘‘విజయం సాధించిన ప్రధాని మోదీకి, ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు. ఈ చరిత్రాత్మక ఎన్నికలో 65 కోట్ల మంది పాల్గొన్నారు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తే ప్రధాని కూడా ఎక్స్‌లో పోస్టు చేశారు.  మోదీని అభినందించిన వారిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే, నేపాల్‌ ప్రధాని పుష్ప కమాల్‌ దహల్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భూటాన్, మారిషస్, జమైకా ప్రధానులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని