Israel: ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి.. భారతీయుడి మృతి

Israel: ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న పోరుకు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ఘర్షణల్లో ఓ భారతీయుడు మృతిచెందాడు. హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా చేసిన క్షిపణి దాడి వల్లే ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్‌ భావిస్తోంది.

Published : 05 Mar 2024 08:21 IST

Israel | జెరూసలెం: లెబనాన్ భూభాగం నుంచి చేసిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లో (Israel) ఓ భారతీయుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కేరళకు చెందినవారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్‌ అనే వ్యవసాయ క్షేత్రంపై ట్యాంకు విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు.

మృతుడిని కేరళలోని కొల్లామ్‌కు చెందిన పట్నిబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఆయన మృతదేహం స్థానిక జీవ్‌ ఆసుపత్రిలో ఉందని అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో గాయపడిన జోసెఫ్‌ జార్జ్‌, పాల్‌ మెల్విన్‌కు చికిత్స అందిస్తున్నారు. పాల్‌కు శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపారు. ఆయన భారత్‌లోని కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ దాడి హెజ్‌బొల్లా పనేనని అనుమానిస్తున్నారు. హమాస్‌కు మద్దతుగా ఈ గ్రూప్‌ అక్టోబర్‌ 8 నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (IDF) ప్రకటించింది.

హమాస్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో ఈ గ్రూప్‌పైనా ఐడీఎఫ్‌ దాడులు చేపడుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు ఏడుగురు పౌరులతో పాటు 10 మంది సైనికులు మరణించినట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల వల్ల తమవైపు 229 మంది మృతిచెందినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని