Papua New Guinea: ఘోర విషాదం.. పాపువా న్యూగినీలో 2,000 మంది సజీవ సమాధి

పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది. శిథిలాల కింద 2,000 మంది ఉన్నట్లు ఆ దేశం ఐరాసకు తెలిపింది.   

Updated : 27 May 2024 14:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాపువా న్యూగినీ(Papua New Guinea)లో కొండచరియలు విరిగి పడిన  ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరిగి వేలకు చేరింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐరాసకు వెల్లడించింది. ‘‘కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2,000 మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు’’ అని ఆ దేశంలోని నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌నుంచి ఐరాస ఆఫీస్‌కు సమాచారం వెళ్లింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖను ఆ కార్యాలయానికి పంపింది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలు పడినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికీ చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో.. శిథిలాల కిందే ఉండిపోయిన క్షతగాత్రుల ప్రాణాలకు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలకు సవాల్‌గా మారింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సైన్యం, ఇతర బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు. మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్‌ సెంటర్‌ ద్వారా సమన్వయం చేసుకొంటామని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. 

శుక్రవారం తెల్లవారుజామున ఈ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై మౌంట్‌ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దెబ్బకు ఆ ప్రావిన్స్‌లో చాలా ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి.  తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని భావించారు. కానీ, భారీ భవనాలు, పంటలు కూడా వీటి కింద చిక్కుకుపోయినట్లు తేలింది. ఈ ప్రమాదం ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.  పోర్గెర మైన్‌కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు