Sharif: పొగడ్తలకు ఒలింపిక్స్‌ పెడితే షరీఫ్‌కు స్వర్ణ పతకం ఖాయం: పాక్‌ మాజీ దౌత్యవేత్త

Eenadu icon
By International News Team Updated : 28 Oct 2025 10:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమయం దొరికినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump)ను పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) పొగడ్తలతో ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పాక్‌ మాజీ దౌత్యవేత్త హుస్సెన్‌ హక్కానీ (Husain Haqqani) స్పందిస్తూ.. షరీఫ్‌ను వెక్కిరించారు. ట్రంప్‌ను పొగిడేవారికి ఒలింపిక్స్‌ పోటీలు పెడితే పాక్‌ ప్రధానికి స్వర్ణ పతకం ఖాయమంటూ ఎద్దేవా చేశారు. హక్కానీ గతంలో అమెరికాలో పాక్‌ రాయబారిగా పనిచేశారు. 

ఇజ్రాయెల్‌- హమాస్‌ల యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టులోని షర్మ్‌-ఎల్‌- షేక్‌లో శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) మాట్లాడుతూ.. ట్రంప్‌ (Trump)ను పొగడ్తలతో ముంచెత్తారు. ట్రంప్‌ అవిశ్రాంత ప్రయత్నాల వల్లే గాజాలో శాంతి నెలకొందన్నారు. ట్రంప్‌ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని.. అందుకుగాను ఆయన నోబెల్‌ శాంతి బహుమతికి అర్హులని ఆకాశానికెత్తారు. భారత్‌- పాక్‌ మధ్య జరిగిన ఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ క్రెడిట్‌ ఇచ్చేశారు. ఇటీవల జరిగిన థాయ్‌లాండ్‌-కంబోడియాల కాల్పుల విరమణ ఒప్పందంలోనూ అమెరికా పాత్రను ప్రశంసించారు. 

షరీఫ్‌ పదేపదే ట్రంప్‌ను పొగడడంపై స్వదేశంలోనే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. పాక్‌ ప్రధాని ట్రంప్‌ చేతిలో కీలుబొమ్మలా మారి.. దేశాన్ని అమ్మేశారంటూ అక్కడి ప్రజలు షరీఫ్‌ను దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్షుడిని షరీఫ్‌ అంతలా పొగడాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాక్‌కు చెందిన చరిత్రకారుడు అమర్‌ అలీ జాన్ ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. సమయం దొరికినప్పుడల్లా షరీఫ్‌ అనవసరంగా ట్రంప్‌ను ప్రశంసిస్తుండడం పాకిస్థానీయులకు ఇబ్బందికరంగా ఉందన్నారు.

Tags :
Published : 28 Oct 2025 10:07 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు