China: ‘అన్‌లాక్‌ చైనా’.. చైనాలో ఆందోళనలు ఉద్ధృతం

కరోనా కట్టడి నిమిత్తం చైనాలో అమలు చేస్తున్న ‘జీరో కొవిడ్‌’ విధానం ఆ దేశంలో తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. అనేకమంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

Published : 27 Nov 2022 10:54 IST

బీజింగ్‌: కొవిడ్‌-19 కట్టడి నిమిత్తం చైనా విధిస్తున్న ఆంక్షలు ఇప్పుడు ఆ దేశంలో తీవ్రస్థాయి ఆందోళనలకు దారితీస్తున్నాయి. షింజియాంగ్‌ రాష్ట్ర రాజధాని ఉరుమ్‌కీలోని ఓ భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించడంతో నిరసనలు మరింత ఉద్ధృతరూపం దాల్చాయి. వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాల్ని మోహరిస్తోంది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించడం, పెప్పర్‌ స్ప్రేను చల్లడం వంటి చర్యలు చేపడుతుండడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

కఠిన లాక్‌డౌన్‌ వల్లే ప్రమాదం తీవ్రరూపం..

భవనంలో కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్లే లోపల ఉన్నవారు వెంటనే బయటకు రాలేకపోయారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. చివరకు శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరణించినవారికి చైనా వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిరసనకారులు నివాళులర్పిస్తున్నారు. షాంఘైలో శనివారం రాత్రి దాదాపు 300 మంది తనతో పాటు నిరసనల్లో పాల్గొన్నట్లు ఝావో అనే వ్యక్తి తెలిపారు. తమపైకి పోలీసులు పెప్పర్‌ స్ప్రే కొట్టారని పేర్కొన్నారు. ‘‘షీ జిన్‌పింగ్‌ స్టెప్‌డౌన్‌; కమ్యూనిస్టు పార్టీ స్టెప్‌డౌన్‌; అన్‌లాక్ షింజియాంగ్‌; అన్‌లాక్‌ చైనా; డునాట్‌ వాంట్‌ పీసీఆర్‌ టెస్ట్’’ అని నినదిస్తూ నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. వీరిని అదుపు చేసేందుకు దాదాపు 100 మంది పోలీసుల్ని ప్రభుత్వం మోహరించినట్లు తెలిపారు. మరింత మంది బస్సుల్లో చేరుకుంటున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మరో నిరసనకారుడు తెలిపారు. కానీ, పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలువరిస్తూ కొంతమందిని మాత్రమే రోడ్డుకు ఒకవైపు నుంచి నడుస్తూ నిరసన తెలిపేందుకు అనుమతిస్తున్నారని పేర్కొన్నారు.

ఇళ్లకు గొలుసులతో తాళాలు..

మరోవైపు ఆందోళనలకు సంబంధించిన పోస్ట్‌లను చైనా ప్రభుత్వం వెంటనే సామాజిక మాధ్యమాల నుంచి తీసివేయిస్తోంది. షింజియాంగ్‌లో దాదాపు మూడు నెలలుగా కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. గురువారం నాటి అగ్నిప్రమాద ఘటనతో ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చి నిరసన చేపట్టారు. నిరసనలు తీవ్రరూపం దాలుస్తుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఉరుమ్‌కీలో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల నుంచి పాక్షిక మినహాయింపుల్ని ఇచ్చింది. కొవిడ్‌ నియంత్రణా చర్యల వల్లే అగ్నిప్రమాద తీవ్రత పెరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మంటల్ని ఆర్పేందుకు సహాయక సిబ్బందికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. దీంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు. మరోవైపు ఇళ్లకు గొలుసులతో తాళాలు వేస్తున్నారని వెల్లడించారు. దీనివల్లే భవనం నుంచి కొంతమంది వెంటనే తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరోవైపు మృతుల సంఖ్య ఎక్కువే ఉందని స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.

రోజుకి 40 వేల కేసులు..

చైనాలో రోజుకి దాదాపు 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కరోనా పూర్తిగా కనుమరుగవుతున్న తరుణంలో చైనాలో మాత్రం విజృంభిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో కొవిడ్‌ విధానమే ఇప్పుడు అక్కడి పరిస్థితుల్ని తీవ్రం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితమే షాంఘైలో దాదాపు 25 లక్షల మందిని లాక్‌డౌన్‌లో ఉంచారు. అప్పటి నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. నెలన్నర క్రితం జెంగ్‌ఝౌలోని ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలోనూ కఠిన లాక్‌డౌన్‌ అమలు చేశారు. దీంతో చాలా మంది అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు కొత్తగా నియమించుకున్నవారికి సరైన వసతులు కల్పించకుండానే లాక్‌డౌన్‌లో ఉంచడం, వేతనాలు సరిగా చెల్లించకపోవడంతో గతవారం పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని