Maldives: ముయిజ్జు పాలనకు అగ్నిపరీక్ష: నేడు మాల్దీవుల్లో పార్లమెంటు ఎన్నికలు

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తీసుకొన్న భారత వ్యతిరేక వైఖరికి అగ్ని పరీక్ష ఎదురయింది. నేడు ఆ దేశ పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 

Published : 21 Apr 2024 12:54 IST

మాలే: ద్వీపదేశం మాల్దీవులో పార్లమెంట్‌ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఇవి అధ్యక్షుడు ముయిజ్జు పాలనపై ప్రజా తీర్పుగా భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఆయన అధికారం చేపట్టాక భారత వ్యతిరేక వైఖరిని అనుసరించారు. ఈ క్రమంలో అక్కడున్న మన బలగాలను వెనక్కి పంపించారు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలకు కీలక కాంట్రాక్టులను కట్టబెట్టారు. ప్రస్తుతం ఆ దేశ పార్లమెంటు సభ్యులు మాత్రం ముయిజ్జు తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. అతడి చర్యలును అడ్డుకోవడానికి మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ కలిసి పనిచేస్తున్నారు. 

ముయిజ్జు సీనియర్ సహాయకుడు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో భౌగోళిక రాజకీయాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత సైన్యాన్ని వెనక్కి పంపిస్తానని హామీ ఇచ్చి ముయిజ్జు అధికారంలోకి వచ్చారు. ఆ దిశగా ప్రయత్నించారు. కానీ, పార్లమెంటు ఆయనకు సహకరించడం లేదు. ఆయన ఎంపిక చేసిన మంత్రులకు వ్యతిరేకంగా ఓటేసి వారి పదవులు పోయేలా చేసింది’’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలను బట్టి ముయిజ్జు పార్టీ కూడా ఈ ఎన్నికలను తమ పాలనకు కఠిన పరీక్షగా భావిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు 2,85,000 మంది ఆదివారం నాడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీటి ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని