Ukraine Russia War: రష్యన్‌ బాంబర్‌ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్‌

సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్‌ను కూల్చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

Published : 19 Apr 2024 17:06 IST

కీవ్‌: భారీస్థాయి దాడులతో ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) కొంతకాలంగా దూకుడు పెంచింది. మరోవైపు ఆయుధాల కొరతతో కీవ్‌ సతమతమవుతోంది. ఈ పరిణామాల నడుమ ఉక్రెయిన్‌ కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి శత్రుదేశానికి చెందిన ఓ దీర్ఘశ్రేణి వ్యూహాత్మక బాంబర్‌ను కూల్చివేసినట్లు వెల్లడించిందని ఓ వార్తా సంస్థ తెలిపింది. పుతిన్‌ ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండించింది. సాంకేతికలోపం కారణంగానే అది స్టావ్రోపోల్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయిందని తెలిపింది.

‘‘గగనతల నిఘా వ్యవస్థ సహకారంతో యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు.. మాస్కోకు చెందిన ‘టీయూ-22ఎం3’ దీర్ఘశ్రేణి వ్యూహాత్మక బాంబర్‌ను కూల్చేశాయి. దీని సాయంతో ఆ దేశం గతంలో మా నగరాలపై ‘కేహెచ్‌-22’ క్షిపణుల వర్షం కురిపించింది’’ అని ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. మరోవైపు.. కూలిపోయిన ఆ బాంబర్‌లోని నలుగురు సిబ్బందిలో ముగ్గురిని కాపాడినట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది. మరొకరి కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు చెప్పింది. అయితే.. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు మృతి చెందినట్లు స్టావ్రోపోల్‌ గవర్నర్‌ చెప్పారు.

ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్‌!

ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యా వాయుసేన శక్తిమంతమైనది. అయితే.. పాశ్చాత్య దేశాలు సమకూరుస్తోన్న క్షిపణి వ్యవస్థలతో కీవ్‌ సవాల్‌ విసురుతోంది. గతంలో అనేక సందర్భాల్లో ఆ దేశ యుద్ధ విమానాలను కూల్చేసింది. జనవరిలో యుద్ధఖైదీలను తరలిస్తోన్న రష్యా సైనిక రవాణా విమానాన్నీ కూల్చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉండగా.. మాస్కో తాజా దాడుల్లో నిప్రో ప్రాంతంలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. రష్యా 22 క్షిపణులు, 14 డ్రోన్లను ప్రయోగించగా.. 15 క్షిపణులు, అన్ని డ్రోన్లను కూల్చేసినట్లు కీవ్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని