Ukraine: క్రిమియాలోని షిప్‌యార్డ్‌పై ఉక్రెయిన్‌ దాడి.. ఓ అత్యాధునిక నౌక ధ్వంసం..!

ఉక్రెయిన్‌ (Ukraine)పై చేస్తున్న యుద్ధంలో రష్యా(Russia)కు మరో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మాస్కో కొన్ని నెలల క్రితమే నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన అత్యాధునిక యుద్ధనౌకపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడి చేసింది. 

Updated : 05 Nov 2023 15:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia) ఆధీనంలోని క్రిమియా (Crimea)లోని కెర్చ్‌ పోర్ట్‌ సిటీపై ఉక్రెయిన్‌ (Ukraine) క్షిపణులతో విరుచుకుపడింది. ఒక్కసారిగా 15 క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో 13 క్షిపణులను రష్యా కూల్చేయగా మిగిలినవి లక్ష్యాలను ఛేదించాయి. దీంతో రష్యాకు చెందిన ఓ అత్యాధునిక నౌక ధ్వంసమైనట్లు సమాచారం. ఈ నౌకలో కిల్బిర్‌ క్షిపణులు ఉన్నట్లు ఉక్రెయిన్‌ వాయుసేన కమాండర్‌ మైకొలా ఒలెస్చుక్‌  వెల్లడించారు. దాదాపు 20 నెలలుగా చేస్తున్న ఈ యుద్ధంలో రష్యా వందల క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది.  ‘‘మరో నౌక మాస్కోవా బాట పట్టింది’’ అని మైకొలా ఒలెస్చుక్‌ వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌ దళాలు చేసిన క్షిపణి దాడిలో మాస్కోవా అనే భారీ యుద్ధనౌక మునిగిపోయిన విషయం తెలిసిందే. 

దాడులను ఆపితే హమాస్‌ మరింత రెచ్చిపోతుందేమో: అమెరికా

తాజా దాడిలో రష్యా క్రూజ్‌ మిసైల్‌ క్యారియర్‌ అస్కోల్డ్‌ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొన్ని ఉక్రెయిన్‌ టెలిగ్రామ్‌ ఛానల్స్‌ వెల్లడించాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉక్రెయిన్‌కు చెందిన కొన్ని లక్ష్యాలపై అస్కోల్డ్‌ దాడులు చేసింది. ఈ నౌకపై కిల్బిర్‌ మిసైల్‌ సిస్టమ్‌, పింట్‌సర్‌ మీడియం రేంజి మిసైల్‌ వ్యవస్థ, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ శతఘ్ని వ్యవస్థలను అమర్చారు. ఈ నౌక కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి వచ్చింది.  

మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. యుద్ధ నౌకలపై దాడి చేయగల సామర్థ్యం కీవ్‌కు మెరుగుపడటంతో.. రష్యాకు నల్ల సముద్రంలో నిఘా శక్తి గణనీయంగా తగ్గిపోతోందన్నారు.  ఫలితంగా ఉక్రెయిన్‌ ధాన్యం ఎగుమతికి మార్గం దొరుకుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని