China: అమెరికా నౌకను దక్షిణ చైనా సముద్రం నుంచి తరిమేశాం..!

దక్షిణ చైనా సముద్రంపై వాషింగ్టన్‌-బీజింగ్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. అమెరికా నౌకను తరిమేశాం అని చైనా ప్రకటించింది. 

Published : 23 Mar 2023 18:53 IST


 

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)కు చెందిన గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ యూఎస్‌ఎస్‌ మిలియూస్‌ను దక్షిణ చైనా సముద్రం నుంచి తరిమేసినట్లు గురువారం బీజింగ్‌ ప్రకటించింది. తమ ప్రాదేశిక జలాల్లోకి  ఇది అక్రమంగా ప్రవేశించిందని చైనా ఆరోపించింది. ప్రశాంతంగా ఉన్న వాణిజ్య మార్గంలో శాంతి, స్థిరత్వానికి భంగం వాటిల్లేలా అమెరికా యుద్ధనౌకలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. దీంతో అమెరికా నౌకను తమ జలాలకు దూరంగా పంపించామని పేర్కొంది. ‘‘ఇక్కడ ఉన్న మా దళాలు ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రంలో జాతీయ సార్వభౌమత్వం, శాంతి, సుస్థిరతను కాపాడటానికి అవసరమైన చర్యలు మొత్తం తీసుకొంటుంది’’ అని చైనా(China) దక్షిణ థియేటర్‌ కమాండ్‌కు చెందిన ప్రతినిధి తియాన్‌ జునిల్‌ పేర్కొన్నారు. 

మరోవైపు చైనా ప్రకటన పూర్తిగా తప్పు అని అమెరికా పేర్కొంది.  యూఎస్‌ఎస్‌ మిలియూస్‌ దక్షిణ చైనా సముద్రంలో సాధారణ గస్తీ కార్యకలాపాలను నిర్వహిస్తోందని అమెరికా పేర్కొంది. తమ నౌకను ఎవరూ అక్కడి నుంచి పంపించలేదని వాషింగ్టన్‌ వెల్లడించింది. భవిష్యత్తులో కూడా అమెరికా ఆ ప్రదేశంలోని అంతర్జాతీయ గగనతలం, సముద్ర జలాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఆ దేశ నౌకాదళం పేర్కొంది. 

దక్షిణ చైనా సముద్రంలో దాదాపు 7 కిలోమీటర్లు విస్తరించిన పరాసల్‌ ద్వీప సమూహంపై చైనాకు ఇతర దేశాలకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ ద్వీపాలపై చైనా అనధికారికంగా నియంత్రణ సాధించింది. వీటిపై పలు సైనిక స్థావరాలు, ఔట్‌పోస్టులను నిర్మించింది. ఇప్పటికే ఈ ద్వీప సమూహంపై తైవాన్‌, వియత్నాం కూడా యాజమాన్య హక్కులు ఉన్నట్లు చెబుతున్నాయి.  గతేడాది జులైలో కూడా ఇదే ప్రదేశంలో అమెరికా డెస్ట్రాయర్‌ను తాము తరిమికొట్టామని చైనా ప్రకటించుకొంది. అప్పట్లో కూడా అమెరికా దళాలు చైనా ప్రకటన తప్పు అని కొట్టిపారేశాయి. తాము ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ ఆపరేషన్‌ నిర్వహించామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని