Israel: ఇజ్రాయెల్‌ దళంపై అమెరికా ఆంక్షలు?.. మండిపడ్డ నెతన్యాహు!

Israel: మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కీలక దళంపై అమెరికా ఆంక్షలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.

Published : 21 Apr 2024 12:20 IST

టెల్‌ అవీవ్‌: ‘ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ( IDF)’కు చెందిన ‘నెట్జా యెహుదా’ బెటాలియన్‌పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తినీయులపై మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ యాక్సియోస్‌ వార్తాసంస్థ శనివారం ఓ కథనం ప్రచురించింది.

నెట్జా యెహుదాపై (Netzah Yehuda) అనేక ఆరోపణలు ఉన్నాయి. పాలస్తినావాసులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డట్లు గతంలో వార్తలు వచ్చాయి. 2022లో 78 ఏళ్ల పాలస్తినా-అమెరికన్‌ ఒమర్‌ అసద్‌ మృతికి వీరే కారణమన్న ఆరోపణలున్నాయి. 2022 డిసెంబరులో వెస్ట్‌బ్యాంక్‌ నుంచి ఈ దళాన్ని ఇజ్రాయెల్‌ (Israel) తరలించింది. కానీ, ప్రభుత్వం దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. నాటి నుంచి ఈ దళం ఇజ్రాయెల్‌ ఉత్తర భాగంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెటాలియన్‌పై పలు వివాదాలున్నాయి.

అమెరికా ఆంక్షల వార్తలపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) స్పందించారు. ఉగ్రవాదులపై పోరాడుతున్న తరుణంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ‘‘ఐడీఎఫ్‌పై ఆంక్షలు విధించొద్దు. ఇజ్రాయెల్‌ పౌరులపై చర్యలను నేను వ్యతిరేకిస్తున్నాను. ఆ దిశగా బైడెన్‌ కార్యవర్గంతోనూ మాట్లాడుతున్నాను. మా సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. ఈ తరుణంలో ఆంక్షలు విధించడం సరికాదు. అలా చేసినట్లయితే అది అనైతికతం. దీన్ని అడ్డుకోవడానికి యత్నిస్తాం’’ అంటూ నెతన్యాహు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ఇజ్రాయెల్‌ (Israel) జాతీయ భద్రత శాఖ మంత్రి ఇతమార్ బెన్ గవిర్ సైతం ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ దళాలపై ఆంక్షలను రెడ్‌ లైన్‌గా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గద్దని రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌కు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు