Biden: అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్‌

Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 24 Apr 2024 15:36 IST

వాషింగ్టన్‌: నవంబరులో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికా (USA)లో ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వాదిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని తన మద్దతుదారులను ప్రశ్నించారు.

యావత్‌ ప్రపంచం కోరుకుంటోంది..

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్ (Joe Biden) అన్నారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన దగ్గరకు వచ్చి ‘మీరే గెలవాలి’ అని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు. యావత్‌ ప్రపంచం అమెరికావైపే (USA) చూస్తోందన్నారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే.. ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరూ దృష్టి సారించారని తెలిపారు.

500 మి.డాలర్ల విరాళాలు..

తన ప్రచారం అద్భుతంగా ముందుకెళ్తోందని బైడెన్ (Joe Biden) తెలిపారు. ఇప్పటి వరకు తమకు 500 మిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. వీటిని 16 లక్షల మంది దాతలు అందించారని వెల్లడించారు. వీరిలో 97 శాతం మంది 200 డాలర్లకు దిగువనే ఇచ్చారని చెప్పారు.

పోల్స్‌లో మనకే అనుకూలం..

అనేక సర్వేల్లో ట్రంప్‌ కంటే తానే ముందున్నానని బైడెన్‌ (Joe Biden) అన్నారు. ‘‘ఇప్పటి వరకు వెలువడిన 23 జాతీయ స్థాయి పోల్స్‌లో పదింటిలో నేనే ముందున్నాను. ట్రంప్‌ (Donald Trump) ఎనిమిదింటిలో ఆధిక్యంలో ఉన్నారు. ఐదింటిలో టై అయ్యింది. కచ్చితంగా పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి. మార్కెట్‌ పోల్‌లో ఎనిమిది పాయింట్లు ఎగబాకాం. ఎకెలన్‌ పోల్‌లో ఏడు పాయింట్లు మెరుగయ్యాం. మార్టిస్ట్‌ పోల్‌లో మూడు పాయింట్లు పెరిగాయి’’ అని బైడెన్ తన మద్దతుదారులకు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని