Yoga at UN: యోగాకు ఎలాంటి పేటెంట్‌, రాయల్టీలు లేవు: ప్రధాని మోదీ

యోగాకు ఎలాంటి కాపీరైట్‌, పేటెంట్‌, రాయల్టీ లేవని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Published : 21 Jun 2023 20:32 IST

న్యూయార్క్‌: యోగా (Yoga) ఏ ఒక్క దేశం, మతం, వర్గానికి చెందినది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. దీనికి ఎలాంటి కాపీరైట్‌, పేటెంట్‌, రాయల్టీలు లేవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Day of Yoga) సందర్భంగా న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం (United Nations) వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐరాస ఉన్నతాధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలతోపాటు 180 దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఇందులో భాగస్వామ్యమయ్యారు.

‘ప్రతిదేశం నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తొమ్మిదేళ్ల క్రితం ఇక్కడనుంచే ప్రతిపాదించాను. యావత్‌ ప్రపంచం దీనికి మద్దతు పలకడం సంతోషంగా ఉంది. యోగా భారత్‌ నుంచి వచ్చింది. దీనికి అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. అన్ని ప్రాచీన సంప్రదాయాల మాదిరిగానే ఇది కూడా సజీవమైనది, ఎంతో చైతన్యమైనది. అన్ని దేశాల సంప్రదాయాలకు సరిపోయే విధానం యోగా. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుంది. దీనికి ఎటువంటి కాపీరైట్లు, పేటెంట్లు, రాయల్టీ చెల్లింపులు లేవు. మీ వయసు, లింగం, ఫిట్‌నెస్‌ స్థాయిలను బట్టి దీన్ని అలవరచుకోవచ్చు. ఇది పూర్తిగా విశ్వజనీనం.. ఆరోగ్యకరమైంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2023ను మిల్లెట్‌ ఇయర్‌ (తృణ ధాన్యాల ఏడాది)గా ప్రకటించాలని భారత్‌ చేసిన ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిదన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతోపాటు అంతర్జాతీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. న్యూయార్క్‌ మేయర్‌, మూడుసార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ కెజ్‌, గాయని ఫాల్గుణి షా, నటులు రిచర్డ్‌ గేర్‌, ప్రియాంక చోప్రాతోపాటు ఐక్యరాజ్య సమితి అధికారులు ఈ యోగా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

న్యూయార్క్‌లో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోదీ రాజధాని వాషింగ్టన్‌ డీసీకి వెళ్తారు. అక్కడి ఆండ్రూ ఎయిర్‌బేస్‌లో ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలుకుతారు. వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈవోలతోపాటు ఇతర ప్రముఖులతో వరుస భేటీలు ఉంటాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. వైట్‌హౌస్‌లో గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత అధ్యక్షుడి కార్యాలయంలో ఇరుదేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ సాయంత్రం అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని