Jobs: కోస్టుగార్డులో 350 కొలువులు

పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారు తీర రక్షణ విభాగంలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది.

Updated : 15 Feb 2024 16:41 IST

పది, ఇంటర్, డిప్లొమాలతో అవకాశం   

పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారు తీర రక్షణ విభాగంలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్, నావిక్‌ జనరల్‌ డ్యూటీ, యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. రాత పరీక్ష, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు.అనంతరం శిక్షణ నిర్వహించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. చిన్న వయసులోనే చెప్పుకోదగ్గ వేతనంతో కెరియర్‌లో స్థిరపడాలనుకునే వారికి ఈ పోస్టులు మంచి అవకాశం! 

ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు. నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

> నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఏప్రిల్‌ 1, 2000-మార్చి 31, 2004 మధ్య జన్మించినవారు అర్హులు.

నావిక్‌ జనరల్‌ డ్యూటీ విభాగంలో 260 ఖాళీలు ఉన్నాయి. వీటికి మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఫిబ్రవరి 1, 2000 - జనవరి 31, 2004 మధ్య జన్మించినవారు అర్హులు.

యాంత్రిక్‌ పోస్టులకు ఎల్రక్టికల్‌ / మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసుకున్నవారు అర్హులు. ఫిబ్రవరి 1, 2000 - జనవరి 31, 2004 మధ్య జన్మించాలి. మెకానికల్‌లో 20, ఎలక్ట్రికల్‌ 13, ఎలక్ట్రానిక్స్‌ 7 ఖాళీలు ఉన్నాయి.

అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది. 

రాత పరీక్ష ఇలా.. 

అన్ని పోస్టులకూ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు. మొత్తం 5 సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ సెక్షన్‌-1 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు వస్తాయి. ఇందులో మ్యాథ్స్‌ 20, సైన్స్‌ 15, ఇంగ్లిష్‌ 15, రీజనింగ్‌ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.

నావిక్‌ డొమిస్టిక్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ ఒక్క సెక్షన్‌ రాసుకుంటే సరిపోతుంది. నావిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులవాళ్లు సెక్షన్‌ 1తోపాటు అదనంగా సెక్షన్‌ 2 రాయాలి. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్‌ సిలబస్‌ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.

యాంత్రిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్‌ 1తోపాటు సెక్షన్‌ 3, 4, 5ల్లో తాము చదివిన బ్రాంచీ ప్రకారం ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్‌ విభాగంవాళ్లు సెక్షన్‌ 3, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచీవాళ్లు సెక్షన్‌ 4, మెకానికల్‌ డిప్లొమా విద్యార్థులు సెక్షన్‌ 5 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో సెక్షన్‌ 50 మార్కులకు చొప్పున ఉంటుంది. 50 ప్రశ్నలు వస్తాయి. వీటికి వ్యవధి 30 నిమిషాలు. సంబంధిత బ్రాంచీలవారీ డిప్లొమా సిలబస్‌ నుంచే ఈ ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఆయా సెక్షన్లవారీ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. జనరల్‌ విభాగానికి చెందినవారైతే సెక్షన్‌ 1లో 30, మిగిలిన సెక్షన్లలో 20 చొప్పున మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్‌ 1లో 27, మిగిలిన సెక్షన్లలో 17 మార్కులు చొప్పున పొందితే అర్హులగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్‌ 2కు ఎంపిక చేస్తారు

స్టేజ్‌ 2 పరీక్షలు 

వీటిని ఒకటి లేదా రెండు రోజుల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కి.మీ.దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్స్‌ తీయగలగాలి. అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి.

స్టేజ్‌ 3 ఎంపిక స్టేజ్‌ 1, స్టేజ్‌ 2లో చూపిన ప్రతిభ ప్రకారం ఉంటుంది. స్టేజ్‌ 2లో అర్హత సాధించినవారిని స్టేజ్‌ 1 మెరిట్‌తో స్టేజ్‌ 3 కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్‌ఎస్‌ చిల్కలో మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేరతారు. స్టేజ్‌ 4లో భాగంగా అభ్యర్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాలు పరిశీలించి అన్నీ సరిగా ఉంటే శిక్షణకు ఎంపిక చేస్తారు.

శిక్షణ

నావిక్‌ జనరల్‌ డ్యూటీ, యాంత్రిక్‌ విభాగాలవారికి ప్రాథమిక శిక్షణ ఫిబ్రవరి, 2022 నుంచి, నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచీలో చేరినవారికి ఏప్రిల్‌ 2022 నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.

యాంత్రిక్‌ ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.29,200 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.6200 యాంత్రిక్‌ పే ఉంటుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వీరు సుమారు రూ.50,000 వరకు వేతనంగా పొందవచ్చు. పదోన్నతుల ద్వారా అసిస్టెంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ హోదా వరకు చేరుకోవచ్చు. 

నావిక్‌ పోస్టుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని వీరు రూ.35 వేల వరకు వేతన రూపంలో పొందవచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకు చేరుకోవచ్చు.

నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచీకి ఎంపికైనవారు కుక్, స్టివార్డ్‌ సేవలు అందిస్తారు. నావిక్‌ జీడీ విభాగంలో చేరినవారు వారికి కేటాయించిన ట్రేడుల్లో సేవలు అందించాలి. యాంత్రిక్‌ ఉద్యోగులు డిప్లొమా బ్రాంచీల ప్రకారం షిప్‌ నిర్వహణ, మరమ్మతులు చూసుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని