NEET 2023: నీట్ దరఖాస్తులకు మరో ఛాన్స్.. ఆ మూడు రోజులు మాత్రమే!
NEET 2023: నీట్కు దరఖాస్తులు చేసుకొనేందుకు ఎన్టీఏ మరో అవకాశం కల్పించింది. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ల విండోను మరోసారి అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది.
దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (NEET UG 2023)పరీక్ష దరఖాస్తుల గడువు ఈ నెల 6తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని ఇబ్బందుల వల్ల దరఖాస్తు చేయలేకపోయామంటూ కొందరు విద్యార్థులు చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఎన్టీఏ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి విద్యార్థులంతా నీట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకొనేందుకు మరో అవకాశం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ రాత్రి 11.30గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దీంతో మంగళవారం https://neet.nta.nic.in/ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ల ట్యాబ్ను మళ్లీ యాక్టివ్లో ఉంచనున్నారు. అలాగే, 13వ తేదీ అర్ధరాత్రి 11.59గంటల వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. ఈ నిర్ణయంతో గతంలో దరఖాస్తులు పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. మరోవైపు, ఇప్పటికే అప్లై చేసుకున్న విద్యార్థుల దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు ఎన్టీఏ కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మన దేశంతో పాటు విదేశాల్లోని మొత్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మే 7న నీట్ పరీక్ష జరగనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. నీట్ పరీక్ష మే 7న (ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల మధ్య జరుగుతుంది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్టీఏ వెబ్సైట్లో వెల్లడించనున్నారు.
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 17.64లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాయగా.. ఈ ఏడాది 18లక్షల మంది రాసే అవకాశం ఉందని ఓ అంచనా. నీట్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. అలాగే, అప్లోడ్ చేసిన ఫొటో కాపీని సైతం మీ వద్దే ఉంచుకోండి. ఆ డాక్యుమెంట్లు తర్వాత అవసరమవుతాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.