‘బనకచర్ల’పై నేడు తెలంగాణలో అఖిలపక్ష భేటీ

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 18 Jun 2025 06:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ చేపట్టిన గోదావరి - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకునేలా అన్ని పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వాన లేఖలు పంపారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను గౌరవ అతిథులుగా ఆహ్వానించడంతోపాటు మంత్రి ఉత్తమ్‌ వారిద్దరికీ ఫోన్‌ కూడా చేశారు. 

అనుమతులు రాకుండా..

బనకచర్ల ప్రాజెక్టును గట్టిగా ప్రతిఘటించడంతోపాటు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని  మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ ఏడాది జనవరిలోనే కేంద్రానికి లేఖ రాశాం. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ స్పందించి.. మే 28న రాష్ట్రానికి లేఖ రాశారు. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి అందలేదని తెలిపారు.  తర్వాత జూన్‌ 3న సీఎం, నేను దిల్లీలో సీఆర్‌ పాటిల్‌ను కలిసి మరోసారి అభ్యంతరాలను లేవనెత్తాం. ఈ నెల 13న మరోమారు నేను లేఖ రాశాను. సీడబ్ల్యూసీ అనుమతులను నిలువరించాలని డిమాండ్‌ చేశాను. ఈ క్రమంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశానికి ఏర్పాట్లు చేశాం’’ అని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఈ నెల 19న కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో మంత్రి ఉత్తమ్‌ దిల్లీలో సమావేశం కానున్నారు.

Tags :
Published : 18 Jun 2025 05:13 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని