Polavaram: పోలవరానికి మూడో కట్టర్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 02 May 2025 05:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈ నెల 7 నుంచి రంగంలోకి
అప్పుడే లక్ష్యానికి తగ్గట్టుగా డయాఫ్రం వాల్‌ పనులు
రాయి లోపల ఎంతవరకు వెళ్లాలనే విషయంలో భిన్నాభిప్రాయం
కేంద్ర జలసంఘం మార్గదర్శనం కోసం నివేదన

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి ఏప్రిల్‌ నుంచి రావాల్సిన మూడో కట్టర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటోంది. మొత్తం 1,396.60 మీటర్ల మేర ఈ వాల్‌ నిర్మించాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికే పూర్తి చేయాలి. లక్ష్యం మేరకు పనులు పూర్తి కావాలంటే ఏప్రిల్‌ నుంచి మూడో కట్టర్, గ్రాబర్‌లతో బావర్‌ కంపెనీ పనులు ప్రారంభించాల్సి ఉంది. అలాంటిది ఒక నెల ఆలస్యంగా ఆ యంత్రం పోలవరానికి చేరుతోంది. ఈ కట్టర్‌లో కొన్ని పరికరాలు గురువారం పోలవరం చేరుకున్నాయి. మిగిలినవి త్వరలో రానున్నాయి. వీటన్నింటినీ బిగించి ఈ నెల 7 నుంచి మూడు కట్టర్లతో పనులు చేపట్టనున్నారు. కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణ పురోగతిని బట్టే ప్రధాన డ్యాం నిర్మాణం, గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడమూ ఆధారపడి ఉన్నాయి.

డి వాల్‌తో పాటు నవంబరు నుంచే సమాంతరంగా ప్రధాన డ్యాం రెండో భాగం పనులూ చేయాలనేది ఆలోచన. విదేశీ నిపుణుల బృందం ఈ నెల 4 నుంచి ప్రాజెక్టు వద్దకు వస్తున్న నేపథ్యంలో ఆకృతులపైనా కీలక చర్చలు జరగనున్నాయి. పోలవరంలో డి వాల్‌ మొత్తం 1,396.60 మీటర్లకు ప్రస్తుతం 230 మీటర్ల వరకు పనులు జరిగాయి. డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో గోదావరి గర్భంలో కొన్నిచోట్ల 20 మీటర్ల లోతు వరకు, మరికొన్ని చోట్ల 90 మీటర్ల లోతు వరకు వెళ్లవలసి ఉంటుంది. ఎక్కడ రాయి తగులుతుందో అక్కడి వరకు ప్యానెల్‌ను పంపి అక్కడ నుంచి ప్లాస్టిక్‌ కాంక్రీటు నింపి ఈ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో లక్ష్యం ప్రకారం డి వాల్‌ పనులు పూర్తయినా మూడో కట్టర్‌ రానందున ఏప్రిల్‌ నెలలో పురోగతి తక్కువగా ఉంది. మూడో కట్టర్‌ రంగ ప్రవేశం తర్వాత పనులు వేగం పుంజుకుంటాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఎలాంటి రాయి తగిలే వరకు పరిగణనలోకి తీసుకోవాలి?

నదీ గర్భంలో రాయి తగిలిన తర్వాత కొన్ని చోట్ల 2 మీటర్లు, మరికొన్ని చోట్ల 3.5 మీటర్ల వరకు కూడా ప్యానెల్‌ పంపి ప్లాస్టిక్‌ కాంక్రీటుతో నింపాల్సి ఉంటుంది. మేఘా కంపెనీ పోలవరం పనులు చేస్తుండగా, డి వాల్‌ వరకు నైపుణ్యం ఉన్న జర్మనీ కంపెనీకి పనులు అప్పగించారు. వారిద్దరి మధ్య.. పనులకు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మెత్తని రాయి తగిలినా అక్కడి నుంచి 2 మీటర్ల లోతుకే పని చేస్తున్నారనే అంశం చర్చనీయాంశమవుతోంది. అది మెత్తని రాయి అని, గట్టి రాయి తగిలే వరకు పరిగణనలోకి తీసుకోకూడదని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ అంశాన్ని నిర్ధారించేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ నుంచి నిపుణులను నియమించారు. వారి అభిప్రాయం తీసుకున్నా దానిపై గుత్తేదారు కంపెనీ ప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశాన్ని పోలవరం అధికారులు కేంద్ర జలసంఘానికి నివేదించారు. ఎలాంటి రాయి తగిలే వరకు పరిగణనలోకి తీసుకోవాలి? రాయి తగిలిన తర్వాత ఎంత లోతు వరకు ప్యానెల్‌ దింపాలనే అంశాలు తేల్చి చెప్పాలని కోరారు.

Tags :
Published : 02 May 2025 04:57 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు