Polavaram: పోలవరానికి ఈ 6 నెలలే కీలకం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 04 May 2025 06:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుత మే, జూన్‌ నెలలతో పాటు ఆ తర్వాత వచ్చే వర్షాకాలం సీజన్‌ కీలకం. వేసవిలో ఈ రెండు నెలలూ డయాఫ్రం వాల్‌ పనులు ఎంత వేగంగా చేయగలరు? వర్షాకాలంలోనూ అంతరాయం కలగకుండా పనులు ఎలా ముందుకు తీసుకెళ్లగలరనే అంశాలపైనే పోలవరం లక్ష్యసాధన ఆధారపడి ఉంది. ప్రాజెక్టు పనుల పురోగతిని సాంకేతికంగా పరిశీలించి.. ఆకృతులు, ఇతర అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు విదేశీ నిపుణులు ఛార్లెస్‌ రిచర్డ్‌ డొన్నెల్లీ, డగ్లస్‌ హించ్‌ బెర్గర్, బ్రియాన్‌ పాల్, డి.సిస్కోలు ఆదివారం సాయంత్రానికి రాజమహేంద్రవరం చేరుకుంటారు.

సోమవారం ఉదయం పోలవరం వెళ్లి, ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జల సంఘం నిపుణులు కూడా పరిశీలనలో పాల్గొంటారు. పరిశీలన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిపుణుల సూచనల మేరకు నిర్వహించిన పరీక్షల నివేదికలపై సంబంధిత విభాగాల వారితో చర్చిస్తారు. డయాఫ్రం వాల్‌ మెథడాలజీ, గ్యాప్‌-1 ప్రధాన డ్యాం ఆకృతుల ఖరారుపై చర్చ జరగనుంది. కీలకమైన గ్యాప్‌-2 ప్రధాన డ్యాం పనులు నవంబరు నుంచి ప్రారంభించే తరుణంలో వాటి ఆకృతులపైనా చర్చించనున్నారు. ఈ నెల 8 వరకు విదేశీ నిపుణుల ప్రాజెక్టు సందర్శన ఉంటుందని, 9న దిల్లీలో ప్రాజెక్టు పనులపై కేంద్ర జలసంఘం అధికారులతో సమీక్షిస్తారని జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. 

తొలుత లోతు పనులు పూర్తి చేసి.. 

డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు ప్రస్తుతం రెండు కట్టర్లతో జరుగుతున్నాయి. వచ్చే వారంలో మూడో కట్టర్‌ కూడా రంగంలోకి దిగుతుంది. చైనేజి 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు ఈ వాల్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. నదీగర్భంలో ప్రధాన డ్యాంలో పునాదిలా కట్‌ ఆఫ్‌ వాల్‌ నిర్మాణం సాగుతోంది. నది లోపల కొన్నిచోట్ల 10 మీటర్ల నుంచి 90 మీటర్ల లోతు (రాయి తగిలే) వరకు ప్యానళ్లు దింపి అందులో ప్లాస్టిక్‌ కాంక్రీటు నింపి పనులు చేయాల్సి ఉంటుంది. 430 మీటర్ల నుంచి 890 మీటర్ల మధ్య నదీగర్భంలో రాయి తగలాలంటే చాలా లోతుకు వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల నదిలో పెద్దగా నీరుండని మే, జూన్‌ నెలల్లోనే అక్కడ పనులు చేయాలని నిర్ణయించుకున్నారు. వర్షాకాలంలో 89 మీటర్ల నుంచి 220 మీటర్ల వరకు ఒక భాగంగా, 1,070 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు మరో భాగంగా డయాఫ్రం వాల్‌ పనులు పూర్తి చేయాలనేది వ్యూహం.

వర్షాకాలంలో ప్లాట్‌ ఫాం మీదుగా..

వర్షాకాలంలో పని చేయాల్సిన ప్రాంతంలో ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయిస్తున్నారు. వానాకాలంలో దానిపై యంత్ర సామగ్రి ఏర్పాటు చేసుకుని, ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న సీపేజ్‌ నీటిని తోడుతూ పనులు పూర్తి చేయాలనేది విదేశీ నిపుణుల సలహా. ఆ ప్లాట్‌ఫాం 20 మీటర్ల ఎత్తుకు నిర్మిస్తున్నారు. దాన్ని 22 మీటర్లకు పెంచితే వానాకాలంలోనూ నిర్దేశిత ప్రాంతంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణం ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలమని, ఆ మేరకు పెంచాలని బావర్‌ కంపెనీ కోరుతోంది.

Tags :
Published : 04 May 2025 06:06 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని