Cyber Crime: భారత్‌ లక్ష్యంగా సైబర్‌ నేరాలు

కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ఏజెంట్లు నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల చొప్పున వసూలు చేశారు. అనంతరం వారిని చైనా, కాంబోడియా కంపెనీలకు చెందిన ఏజెంట్లకు అప్పగించారు.

Updated : 25 May 2024 06:35 IST

చైనా ఏజెంట్ల వలలో 5000 మంది భారతీయులు
కాంబోడియా నుంచి రాష్ట్రానికి చేరుకున్న 24 మంది
విశాఖ పోలీసుల చొరవతో బాధితులకు విముక్తి

బాధితులతో కలసి విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సీపీ రవిశంకర్‌ 

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్‌టుడే, గోపాలపట్నం: కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ఏజెంట్లు నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల చొప్పున వసూలు చేశారు. అనంతరం వారిని చైనా, కాంబోడియా కంపెనీలకు చెందిన ఏజెంట్లకు అప్పగించారు. భారతీయులే లక్ష్యంగా సైబర్‌ నేరాలకు పాల్పడటంపై బాధితులకు సదరు ఏజెంట్లు శిక్షణ ఇచ్చారు. తిరస్కరించినా, ఎదురుతిరిగినా చిత్రహింసలకు గురిచేశారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మానవ అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపిన విశాఖ పోలీసులు.. కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాలశాఖ సహకారంతో కొందరు బాధితులకు విముక్తి కల్పించారు. శుక్రవారం రెండు విమానాల్లో విశాఖ చేరుకున్న 24 మందికి విశాఖ పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. 

ఏజెంట్లకు నోటీసులు 

‘విదేశీ వ్యవహారాలశాఖ, భారత రాయబార కార్యాలయం ప్రతినిధుల సహకారంతో బాధితులను క్షేమంగా రప్పించేందుకు చర్యలు తీసుకున్నాం. తొలి విడతగా ఒక విమానంలో 10 మంది, మరో విమానంలో 14 మంది విశాఖ చేరుకున్నారు. వారు క్షేమంగా ఇళ్లకు చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ జాయింట్‌ కమిషనర్‌ డా.ఫకీరప్ప నేతృత్వంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లు, కాంబోడియా ఏజెంట్లకు మధ్య ఒప్పందాల గురించి విచారణలో తెలుస్తుంది. మొత్తం 70 మంది ఏజెంట్లు, సబ్‌ఏజెంట్లకు నోటీసులు పంపించాం. నిందితులపై చర్యలు తీసుకుంటాం. చైనా ఏజెంట్లు, వారు కొల్లగొట్టిన డబ్బును పంపిన ఖాతాల వివరాలను సేకరిస్తున్నాం. బాధితుల ఫోన్లలో తీసిన చిత్రాలు, సేకరించిన వివరాలతో విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కాంబోడియా ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాం’ అని సీపీ రవిశంకర్‌ తెలిపారు. 

7 నుంచి 10 రోజుల శిక్షణ

 విశాఖకు చేరుకున్న బాధితుల నుంచి పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. వాటి ప్రకారం.. చైనా ఏజెంట్లు తొలుత బాధితుల పాస్‌పోర్టులు లాగేసుకున్నారు. భారత్‌పై సైబర్‌ నేరాలకు ఎలా పాల్పడాలో 7 నుంచి 10 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఫెడెక్స్‌ కొరియర్, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ, ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటనల పేరిట భారతీయులను ఎలా మోసగించాలో నేర్పించారు. ఇప్పటికే విశాఖ సిటీ నుంచి రూ.120 కోట్లు కొల్లగొట్టారు. తాజాగా ఫెడెక్స్‌ కొరియర్‌ పేరిట విశాఖకు చెందిన మహిళ ఖాతా నుంచి రూ.3.2 కోట్లు కొట్టేశారు. భారతీయులను సైబర్‌ ఉచ్చులోకి దింపి నగదు లాగేస్తున్నారు. వాటిని వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తూ.. క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. కొందరు ఏడాదిగా, మరొకొందరు ఆరు నెలలు, మూడు నెలలుగా కాంబోడియాలో పనిచేస్తున్నారు. చైనా ఏజెంట్ల వలలో దేశవ్యాప్తంగా 5000 మంది చిక్కుకున్నట్లు అంచనా. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 150 మంది, విశాఖకు చెందిన 58 మందిని గుర్తించారు. మరికొంతమంది.. పోలీసులను సంప్రదిస్తున్నారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

చీకటి గదుల్లో బంధించి.. బ్యాట్‌తో కొట్టి 

ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో ఉండేవారే లక్ష్యంగా సైబర్‌ మోసాలకు తెగబడ్డారు. తెలుగు వచ్చిన వారు ఆ భాష వారిని లక్ష్యంగా చేసుకోవాలని బాధిత యువకులపై ఏజెంట్లు ఒత్తిడి చేసేవారు. ఆ నేరాలు చేయలేమని నిరసన తెలిపితే చీకటి గదుల్లో బంధించేవారు. భోజనం కూడా పెట్టకుండా తీవ్రంగా హింసించేవారు. బేస్‌బాల్‌ బ్యాట్లతో కొట్టేవారు. పనితీరు సరిగా లేనివారికి, లక్ష్యాన్ని చేరుకోలేనివారికి ఒక పూట మాత్రమే భోజనం పెట్టేవారు. ఎక్కువ మందిని మోసగిస్తే రెండు పూటలా భోజనం పెట్టేవారు. చైనా ఏజెంట్లను మెప్పిస్తే పార్టీలు, బహుమతులు కూడా ఇచ్చేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని