Food Prices: ఈ బాదుడుకు.. పేదలు బతికేదెలా?

నాలుగేళ్లలో పెరిగిన నిత్యావసరాల ధరల వల్ల ఒక్కో కుటుంబంపై నెలకు రూ.3,400 వరకు భారం పడింది. అంటే వంటింటి బడ్జెట్‌ ఏడాదికి రూ.40,800 పెరిగింది.

Updated : 05 Jul 2023 09:51 IST

ఒక్కో కుటుంబంపై నాలుగేళ్లలో రూ.1.63 లక్షల భారం
పెరుగుతున్న బియ్యం, కూరగాయల ధరలు
వంటగ్యాస్‌ నుంచి పచారీ సరకుల వరకు అన్నీ మంటలే
భారీగా పెరిగిన వంటింటి ఖర్చు
ఈనాడు - అమరావతి

నాలుగేళ్లలో పెరిగిన నిత్యావసరాల ధరల వల్ల ఒక్కో కుటుంబంపై నెలకు రూ.3,400 వరకు భారం పడింది. అంటే వంటింటి బడ్జెట్‌ ఏడాదికి రూ.40,800 పెరిగింది. పెరిగిన వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలను పరిశీలిస్తే.. నాలుగేళ్లకు రూ. 12,800 బాదేశారు. ‘మీ బిడ్డ పాలనలో..’ అంటూ కుడిచేత్తో వడ్డిస్తూ, ఎడమచేత్తో విదిలిస్తూ పేదల నడ్డి విరగ్గొట్టడంలో జగన్‌ను మించిన నాయకుడు ఎవరుంటారు?

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుల జేబులను గుల్ల చేస్తున్నాయి.  టమాటా కిలో రూ.100 దాటేసింది. పచ్చిమిర్చి అంతకు మించిపోయింది. కందిపప్పు కిలో కొనాలంటే రూ.150 పైమాటే. బియ్యం ధరలు బరువెక్కుతున్నాయి. వంటగ్యాస్‌ వెలిగించకముందే మండిపోతోంది.. పెరిగిన సిలిండర్‌ ధరలతో నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై రూ.12,800 చొప్పున అదనపు భారం పడింది. నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతుండటంతో.. పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్‌ రాకెట్‌ తీరున దూసుకెళ్తోంది. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే పప్పుల ధరలు 30% నుంచి 70% వరకు పెరిగాయి. నాణ్యమైన సన్న బియ్యం రేటు ఏడాదిలోనే 20% ఎగసింది. కరోనా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ నేపథ్యంలో మండిన నూనెల ధరలు తరవాత కాస్త దిగొచ్చినా.. ఇంకా సలసల మరుగుతూనే ఉన్నాయి. కూరగాయల ధరలు 100% నుంచి 200% వరకు ఎగశాయి. మొత్తంగా చూస్తే నాలుగేళ్లలో పేదల వంటింటి బడ్జెట్‌ 60% పెరిగింది. ఒక్కో కుటుంబంపై నెలకు రూ.3,400 పైగా అదనపు భారం పడుతోంది. ధరల భారం భరించలేక నిరుపేదలు కుంగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.పైగా వారిని మరింత కష్టాల్లోకి నెట్టేస్తోంది. రాయితీపై రేషన్‌ కార్డుల ద్వారా ఇచ్చే సరకుల్లోనూ కోత పెట్టి.. సహనాన్ని పరీక్షిస్తోంది.

పప్పు వండాలన్నా వందనోటు ఒక్కటే చాలదు..!

పచారీ సరుకుల ధరల భారీగా పెరిగాయి. కందిపప్పు గత నాలుగైదు నెలల్లోనే కిలోకు రూ.50కి పైగా పెరిగింది. బియ్యం ధర మునుపెన్నడూ లేని స్థాయికి చేరడం గమనార్హం. నాణ్యమైన సన్నబియ్యాన్ని కిలో రూ.57 నుంచి రూ.58కి కొనాల్సి వస్తోంది. మధ్యస్థ రకం బియ్యం కొనాలన్నా కిలో రూ.50 వరకు ఉంది. పామోలిన్‌, పొద్దుతిరుగుడు నూనెల ధరలు కొంతమేర తగ్గినా.. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే భారీగా పెరిగాయి. లీటరు వంటనూనె కొనాలంటే రూ.100 నోటు ఒక్కటే సరిపోదు. పంచదార, బెల్లం ధరలు కూడా సగటున 20% వరకు పెరిగాయి. బ్రాండెడ్‌ కంపెనీల బియ్యం, పప్పులు, నూనెలు కొనాలంటే కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు అధికంగా పలుకుతున్నాయి. గోధుమపిండి, ఇడ్లీరవ్వ, ఉప్మారవ్వ, ఇతర సరకుల ధరలూ సగటున 30% పైనే పెరిగాయి. టీ, కాఫీ పొడుల ధరలూ కిలోకు రూ.150 వరకు ఎగశాయి. పచ్చజొన్నల ధరలు కిలో రూ.90కి చేరాయి.

* కోడి మాంసం ధర ఇటీవలి వరకు కిలో రూ.320కి చేరింది. ప్రస్తుతం కిలోకు రూ.80 వరకు తగ్గాయి. కోడి గుడ్డు ధర రూ.6 వరకు చేరింది.

ట‘మోత’.. ఘాటెక్కిన పచ్చిమిర్చి

కిలోల లెక్కన కూరలు కొనడం కష్టమే. గతంలో రూ.100 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు కిలో టమాటా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉత్పత్తి తగ్గిపోవడంతో.. టమాటా ధర అంతకంతకూ పెరుగుతోంది. కిలో రూ.120 కి చేరింది. పచ్చిమిర్చి ధర కూడా వారం వ్యవధిలోనే రూ.80కి పైగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.150 పైనే పలుకుతోంది. పట్టణాల్లోని కొన్ని మాల్స్‌, ఆన్‌లైన్‌లో అయితే కిలో రూ.280 వరకు ఉండటం గమనార్హం.


చిరు వ్యాపారులు తెచ్చే గేదె పాలు లీటరు రూ.90పైనే ఉన్నాయి. నాలుగేళ్లలో వీటి ధర లీటరుకు రూ.30పైగా పెరిగింది.


 

వంటింటికి మసాలా ఘాటు

సుగంధ ద్రవ్యాల ధరలూ పరుగులు తీస్తున్నాయి. కరోనా తర్వాత ప్రతి ఇంట్లోనూ అల్లం వాడకం పెరిగింది.  ఫిబ్రవరిలో కిలో రూ.60 నుంచి రూ.70 మధ్య పలికిన అల్లం.. మార్చి నెలాఖరుకు రూ.100పైగా చేరింది. అక్కడ నుంచి రూ.250 వరకు చేరింది. కొన్నిచోట్ల ఇంకా ఎక్కువే పలుకుతోంది. కారంపొడి ధర ఏకంగా 150% నుంచి 200% వరకు పెరిగింది. పచ్చళ్లకు ఉపయోగించే కారం అయితే మరింత ఘాటెక్కింది. వెల్లుల్లి రేటు కూడా 20% వరకు పెరిగింది.

* టీ, కాఫీపొడి ధరలు గతంతో పోలిస్తే పెరిగాయి.

వంటగ్యాస్‌.. నాలుగేళ్లకు రూ.12,800 బాదుడు

వంటగ్యాస్‌ ఎంత తక్కువగా వినియోగించినా ప్రతి ఇంటికీ ఏడాదికి కనీసం 8 సిలిండర్లు అవసరమవుతాయి. ఒక్కో సిలిండర్‌ ధర నాలుగేళ్ల కిందట రూ.541 ఉండగా.. ఇప్పుడు రూ.1,109 అయింది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల రూ.1,150 నుంచి రూ.1,175 పైమాటే. అంటే 2019 జులై నాటితో పోలిస్తే సిలిండర్‌పై రూ.568 పెరిగింది. సగటున సిలిండర్‌పై రూ.400 చొప్పున ధర పెరిగిందనుకున్నా నాలుగేళ్లకు ఒక్కో కుటుంబం నుంచి రూ.12,800 చొప్పున    లాగేస్తున్నారు.

పేదలపై కనికరం చూపని జగన్‌

రేషన్‌ దుకాణాల్లో బియ్యం తప్ప మరేమీ దొరకడం లేదని ఎన్నికల ముందు నిర్వహించిన ప్రతి సభలోనూ.. వైకాపా అధినేత జగన్‌ చెప్పారు. తాను ముఖ్యమంత్రి కాగానే.. అప్పటి వరకు రేషన్‌ కార్డులపై అందించే నిత్యావసరాలకు కోత పెట్టారు. 2019 జూన్‌ వరకు ఒక్కో కార్డుపై రెండు కిలోల కందిపప్పు, అరకిలో పంచదార, ఉప్పు, గోధుమపిండి, జొన్నలు, రాగులు రాయితీపై అందించేవారు. కందిపప్పును రెండు కిలోల నుంచి కిలోకు కుదించారు. కిలో ధర రూ.40 నుంచి రూ.67కి పెంచారు. అవికూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. సగటున 30% మంది కార్డుదారులకూ అందడం లేదు. జూన్‌, జులైలో అయితే పంపిణీ పూర్తిగా నిలిపేశారు. మార్కెట్లో కిలో రూ.160 చొప్పున కొనుక్కోమని చెప్పి పేదల గోడు పట్టించుకోవడమే మానేశారు. పంచదార ధరనూ అరకిలోకు రూ.10 చొప్పున పెంచారు. గోధుమపిండిని ఇటీవలే ప్రారంభించినా.. అదీ పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. జొన్నలు, రాగులు కూడా     గత నెల నుంచే ప్రారంభించి కొన్ని ప్రాంతాల్లోనే ఇస్తున్నారు.

* 2019 వరకు రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రోత్సాహకాలు అందించారు. రక్షిత సేద్య విధానంలో కూరగాయ పంటల సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైతులకు హైబ్రిడ్‌ కూరగాయ విత్తనాలను రాయితీపై అందించడంతోపాటు మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకునేవారు. అయితే నాలుగేళ్లుగా ఉద్యానరంగానికి ప్రోత్సాహకాలే అందడం లేదు. దీనికితోడు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. మొత్తంగా ధరలు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు