అంతా ప్రచార యావ!

కాలుష్య నియంత్రణతో పాటు, ఇంధన వినియోగం ద్వారా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు విద్యుత్తు వాహనాల (ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ - ఈవీ) వాడకం ప్రత్యామ్నాయ మార్గంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు.

Published : 24 Jul 2023 04:59 IST

విద్యుత్తు వాహనాలకు ప్రోత్సాహం ఉత్తిదే!
జాడలేని ఛార్జింగ్‌ కేంద్రాలు
జగన్‌ సర్కారులో రెండేళ్లుగా ముందుకు పడని అడుగులు
ఈనాడు - అమరావతి

కాలుష్య నియంత్రణతో పాటు, ఇంధన వినియోగం ద్వారా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు విద్యుత్తు వాహనాల (ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ - ఈవీ) వాడకం ప్రత్యామ్నాయ మార్గంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ విద్యుత్తు వాహనాల వినియోగం పెంచాలన్న లక్ష్యం అంతగా విజయవంతం కాలేదు. కానీ విద్యుత్తు ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామనే పేరుతో పైసా ఖర్చు లేకుండా ప్రచారం పొందడంపై మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాస్తవానికి ఈవీల వినియోగానికి ప్రోత్సాహం.. ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు అందించడం వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశమే లేదు. కేవలం ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి.. వాటి ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వచ్చేలా సమన్వయం చేస్తే చాలు. కానీ దీన్ని పూర్తి చేయడమూ గత రెండేళ్లుగా ప్రభుత్వానికి సాధ్యం కావడంలేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 500 విద్యుత్తు ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కేవలం ప్రచార ఆర్భాటంగా మారిపోయాయి.


ప్రోత్సాహం లేక నిరుత్సాహం

ప్రస్తుతం కేవలం ద్విచక్ర వాహనాల ఛార్జింగ్‌ కేంద్రాలు మాత్రమే అక్కడక్కడా అందుబాటులో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఉంటేనే ఈవీలు కొనే వారి సంఖ్య పెరుగుతుంది. మరోవైపు ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం రాయితీలేవీ ఇవ్వడం లేదు. ఛార్జింగ్‌ చేస్తే యూనిట్‌ విద్యుత్తుకు రూ.20 చొప్పున వసూలుకు అనుమతించగా, ఇందులో టారిఫ్‌ రూ.10, స్థలం అద్దె, ఇతరాలకు రూ.3 వ్యయమవుతోంది. దీంతో కేంద్రం నిర్వాహకులకు మిగిలేది రూ.7 మాత్రమే. ప్రస్తుతం వాహనాల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆదాయం పెద్దగా రాదనే కారణంతో ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు.


ఉద్యోగులకు దక్కని ఈవీ భాగ్యం

ఈవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉద్యోగులకు ఏడాదిలో లక్ష విద్యుత్తు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం 2021 జులైలో ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతను నెడ్‌క్యాప్‌కు అప్పగించింది. వాహన కొనుగోలు మొత్తాన్ని 24 నుంచి 60 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. ప్రతి నెలా పెట్రోలు ఖర్చుతో వాయిదా చెల్లించవచ్చని ప్రచారం చేసింది. ఈ పథకం అమలుకు నెడ్‌క్యాప్‌ ప్రత్యేకంగా యాప్‌ రూపొందించి నానా హడావుడి చేసింది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేలా బ్యాంకులతోనూ సంప్రదింపులు జరిపింది. ఇంత చేసినా ఇప్పటివరకు వంద వాహనాలకు మించి ఇవ్వకపోవడం గమనార్హం.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాదుడు

విద్యుత్తు వాహనాల కొనుగోలుదారులకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రం షాకిచ్చాయి. ఈవీల కొనుగోలుపై కేంద్రం రాయితీని తగ్గిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం జీవితపన్ను మినహాయింపును తొలగించింది. దీంతో వాహనాల ధరలు భారంగా మారాయి. విద్యుత్తు వాహనాల కొనుగోలులో కేంద్రం ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌)-2 పథకం కింద 2018 నుంచి అయిదేళ్లపాటు 15 నుంచి 40 శాతం రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచి 15 శాతానికి పరిమితం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈవీల రిజిస్ట్రేషన్‌లో 2018 నుంచి అయిదేళ్లపాటు 12 శాతం జీవితపన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్‌ 7వ తేదీతో ముగిసింది. మినహాయింపు కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని రవాణాశాఖ కోరినా సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో జూన్‌ 8 నుంచి విద్యుత్తు వాహనాల రిజిస్ట్రేషన్‌కు జీవిత పన్ను వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 60 వేల ఈవీలు ఉండగా, ఏటా సగటున 20 వేల కొత్త ఈవీల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా బైక్‌లే ఉంటున్నాయి.


లక్ష్యం

రాష్ట్రంలో జాతీయ రహదారి వెంట ప్రతి 25 కి.మీ.లకు ఒకటి చొప్పున మొత్తం 250 విద్యుత్తు ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. 2023 సంవత్సరంలో నగరాల్లో ద్విచక్ర వాహనాల కోసం మరో 250 ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం కార్పొరేషన్‌, ప్రభుత్వ కార్యాలయాల్లో స్థలాలను గుర్తించాం. ప్రైవేటు వ్యక్తులు.. సంస్థలతో పాటు ఆర్టీసీ బస్టాండ్లు.. ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోనూ ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుమతిస్తాం.

విద్యుత్తు వాహనాలకు ప్రోత్సాహంపై ప్రభుత్వం తరచూ చెప్పే మాటలివి.


నిర్లక్ష్యం

ప్రభుత్వం చెప్పినట్లు జాతీయ రహదారి వెంట ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన అడుగు ముందుకు పడలేదు. జాతీయ రహదారుల వెంట ప్రతి 100 కి.మీలకు ఒక ఛార్జింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసినా.. విద్యుత్తు వాహనాల్లో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగంగా ఉంటుంది. ఈమేరకు సంప్రదింపులు జరపగా.. ఐవోసీ పెట్రోలు బంకుల్లో ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అంగీకరించిందని, ‘ఛార్జింగ్‌ బే’లు.. స్లాట్‌ బుకింగ్‌ సేవలు వస్తాయని అధికారులు చెప్పారు. కానీ గత రెండేళ్లుగా ఇవేవీ కార్యరూపం దాల్చలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు