పోలీసుల.. దొంగాట!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక అక్రమాల్లో దొంగ ఓటర్లే కాదు.. పోలీసుల ప్రమేయమూ బయటపడింది. జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌’ కేసు కింద మార్చి వారు నీరుగార్చేశారు.

Updated : 12 Feb 2024 06:42 IST

దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి.. మూసివేత
తీవ్రమైన ఎన్నికల నేరం కేసును ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌’ కింద మార్చేశారు
వైకాపా నేతల కుట్రలో భాగస్వాములయ్యారు
ఇద్దరు సీఐలు, ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌
మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు వీఆర్‌కు 
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు
నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక అక్రమాలు

ఈనాడు - అమరావతి, తిరుపతి, న్యూస్‌టుడే - తిరుపతి నేర విభాగం: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక అక్రమాల్లో దొంగ ఓటర్లే కాదు.. పోలీసుల ప్రమేయమూ బయటపడింది. జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌’ కేసు కింద మార్చి వారు నీరుగార్చేశారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి మూసేశారు. ఈ సంఘటనలు జరిగిన రెండున్నరేళ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎట్టకేలకు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు వేయించింది. తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోగా పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌ బి.వి.శివప్రసాద్‌రెడ్డి, ఎస్సై ఎ.జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్‌ కె.ద్వారకానాథ్‌రెడ్డి.. తిరుపతి పశ్చిమ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ సస్పెండయ్యారు. ఈ మేరకు అనంతపురం డీఐజీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అలిపిరి పోలీసుస్టేషన్‌లో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సీఐలుగా పనిచేసిన అబ్బన్న, దేవేంద్రకుమార్‌లను వీఆర్‌కు పంపించారు.

డొంకను కదిలించాల్సి వస్తుందని..

తిరుపతిలో వ్యవస్థీకృత ఎన్నికల నేరాలు చోటుచేసుకుంటే.. సూత్రధారులైన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారితోనే అంటకాగుతూ కేసులను సమాధి చేసేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగ లాగితే డొంక బయటపడుతుందన్న దురుద్దేశంతో కేసుల్లో తొలుతే తీగ తెంచేశారు. దొంగ ఓట్లు వేస్తూ చిక్కిన వారిని విచారించటం మాట అటుంచి కనీసం వారి వద్దనున్న పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఈ సంఘటనలను విశ్లేషిస్తే.. ఉపఎన్నిక సందర్భంగా ఈఆర్వో లాగిన్‌, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేయించటం, ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి వారికి కార్డులు, ఓటర్లు స్లిప్పులనిచ్చి దొంగ ఓట్లు వేయించటం, అలా ఓట్లేస్తూ ఎవరైనా దొరికికేసులు నమోదైనప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయకుండా మూసేయించటంలో అధికార పార్టీ నాయకుల నేరపూరిత కుట్ర తేటతెల్లమవుతోంది. దొంగ ఓట్ల దందాను నడిపించారని ప్రతిపక్షాల ఆరోపణలు, ఫిర్యాదులను ఎదుర్కొంటున్న తిరుపతి వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల జోలికి ఎన్నికల సంఘం వెళ్లకపోవటంపై విమర్శలు వస్తున్నాయి.

రూ.200 జరిమానాతో సరిపెట్టేశారు..

2021 ఏప్రిల్‌ 17న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్‌ జరిగింది. నగరంలోని స్కావెంజర్స్‌ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద ఎస్‌.అయ్యప్ప అనే 21 ఏళ్ల యువకుడు.. కొసన రామచంద్ర (38) ఎపిక్‌ కార్డు, ఓటరు స్లిప్పుతో ఓటేసేందుకు నిల్చోగా ప్రతిపక్షాలవారు పోలీసులకు అప్పగించారు. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ బి.మునికృష్ణ.. అయ్యప్పను తూర్పు పోలీసుస్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు.

హెడ్‌కానిస్టేబుల్‌ కె.ద్వారకానాథ్‌రెడ్డి పాత్ర: దొంగ ఓట్లు వేయడం అత్యంత తీవ్రమైన నేరం కాబట్టి సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. అయితే కానిస్టేబుల్‌ కె.ద్వారకానాథ్‌రెడ్డి బెయిల్‌కు వీలైన తేలికపాటి సెక్షన్లు.. ఐపీసీ 171 ఎఫ్‌ (వేరే వ్యక్తికి సంబంధించిన ఓటేయడం), 188 (ప్రభుత్వ ఉద్యోగి ఆదేశాలను ఉల్లంఘించటం) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు, పోలింగ్‌ అధికారులు, అక్కడ భద్రత విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సంఘటన సమయంలో ప్రత్యక్షసాక్షులుగా ఉన్న ఓటర్లను కనీసం విచారించనే లేదు. నిందితుడి వద్దనున్న నకిలీ ఓటరు కార్డు, ఎపిక్‌ కార్డు, ఆధార్‌, ఇతర పత్రాలనూ సీజ్‌ చేయలేదు. కేసు దర్యాప్తు ఇక్కడే పక్కదారి పట్టింది.

  • ఎస్సై ఎ.జయస్వాములు ప్రమేయమేంటి?: కేసు దర్యాప్తు అధికారి, ఎస్సై ఎ.జయస్వాములు అసలు నేర సంఘటనా స్థలాన్నే సందర్శించలేదు. దొంగ ఓట్ల నేరాన్ని నిరూపించేందుకు కావాల్సిన ఆధారాలను సేకరించాల్సిన ఆయన.. అది వదిలేసి ఈ నేరాన్ని ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌’ సంఘటనగా పేర్కొంటూ ఆ మేరకు ఐపీసీ సెక్షన్‌ 290 కింద కేసును మార్చేస్తూ న్యాయస్థానంలో మెమో, అభియోగపత్రం సమర్పించారు. దీనికి ఉన్నతాధికారుల అనుమతినీ తీసుకోలేదు. కేసును నిర్వీర్యం చేశారు.
  • ఇన్‌స్పెక్టర్‌ బి.వి.శివప్రసాద్‌రెడ్డి: తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వోగా పనిచేసిన బి.వి.శివప్రసాద్‌రెడ్డికి ఈ దొంగ ఓట్ల సంఘటన గురించి, నమోదైన కేసు గురించి అవగాహన ఉంది. స్టేషన్‌ అధిపతిగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేయాల్సిన ఆయన అసలు ఆ విషయమే పట్టించుకోలేదు.
  • పోలీసు అధికారులు బి.వి.శివప్రసాద్‌రెడ్డి, ఎ.జయస్వాములు, కె.ద్వారకానాథ్‌రెడ్డిలు.. వైకాపా నాయకుల కుట్రలో భాగస్వాములై కేసును నీరుగార్చేశారు. పబ్లిక్‌ న్యూసెన్స్‌ సంఘటన కింద మార్చేసి అభియోగపత్రం సమర్పించడంతో న్యాయస్థానం నిందితుడికి రూ.200 జరిమానా విధించి కేసు మూసేసింది.

కొన్ని కేసులు మూసేసి...

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో అక్రమాలపై తిరుపతి తూర్పు, పశ్చిమ, ఎమ్మార్‌పల్లి, అలిపిరి, యూనివర్సిటీ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో చాలా కేసులను పోలీసులు మూసేశారు. మరికొన్ని తప్పుడు కేసులంటూ తేల్చేశారు. ఇంకొన్ని పక్కదారి పట్టించేశారు.వ్యవస్థీకృత నేరంగా పరిగణించి సూత్రధారుల్ని పట్టుకోవాల్సి ఉండగా ఆ పనే చేయలేదు.

ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిపై విచారణకు డిమాండ్‌

ఉపఎన్నిక సమయంలో ఎస్పీగా చింత వెంకటప్పలనాయుడు ఉన్నారు. దొంగ ఓటర్లను ఆయన అడ్డుకోలేదన్న విమర్శలున్నాయి. అనంతరం ఆ జిల్లా ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కేసుల ఎత్తివేత, దర్యాప్తు పక్కదారి పట్టించేలా చేయటంలో ఆయనదే ప్రధాన పాత్రనే విమర్శలున్నాయి. దీనిపై విచారించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అమ్మిరెడ్డికి ఎంత కష్టమో!

అనంతపురం రేంజి డీఐజీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల ఆదేశాలే చట్టమన్నట్టుగా పనిచేస్తారన్న విమర్శలున్నాయి. వైకాపా కోసం అంతలా పనిచేసే ఆయనకే.. చివరికి దొంగ ఓట్ల కేసులను నీరుగార్చిన తన సిబ్బందిపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సీరియస్‌గా దృష్టి సారించటంతో తప్పనిసరై బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే పోలీసు శాఖలోని కొందరు ‘అయ్యో.. అమ్మిరెడ్డికి ఎంత కష్టమొచ్చిందో’ అని చర్చించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని