ట్రాక్టర్‌తో తొక్కించి చంపినా.. రోడ్డు ప్రమాదమేనట!

నీళ్లు పట్టుకోవడానికి ట్యాంకర్‌ వద్దకొచ్చిన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తే.. అది రోడ్డుప్రమాదంగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 03 Mar 2024 09:03 IST

పల్నాడు జిల్లా మల్లవరం ఘటనలో విమర్శలు వచ్చినా మారని పోలీసుల తీరు

ఈనాడు, నరసరావుపేట: నీళ్లు పట్టుకోవడానికి ట్యాంకర్‌ వద్దకొచ్చిన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తే.. అది రోడ్డుప్రమాదంగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో శుక్రవారం వైకాపాకు చెందిన డ్రైవర్‌ వడితే మణికంఠనాయక్‌.. ట్యాంకర్‌ వద్ద మంచినీళ్లు అడిగిన తెదేపాకు చెందిన బాణావత్‌ సామునిబాయ్‌ని ట్రాక్టర్‌తో తొక్కించాడు. తీవ్రంగా గాయపడి బాధితురాలు ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ఘటనలో నిందితుడిపై హత్య కేసు నమోదు చేయాలని మృతురాలి సోదరుడు శ్రీనునాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ‘రోడ్డుప్రమాద కేసు (సెక్షన్‌ 304ఎ)’ నమోదు చేశారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేయాల్సి ఉండగా.. పట్టించుకోకుండా రహదారి ప్రమాదమంటూ కేసు పెట్టడమేంటని తెదేపా మాచర్ల అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, నేతలు విమర్శిస్తున్నారు. మృతదేహానికి శనివారం పంచనామా చేయించి బంధువులకు అప్పగించగా స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు. మరోవైపు పలువురు వైకాపా నేతలు బాధిత కుటుంబంతో రాజీ కోసం యత్నిస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని