పెరిగిన టోల్‌ ఛార్జీలు

టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్‌ 1న టోల్‌ రుసుం పెరుగుతుంది.

Updated : 01 Apr 2024 06:45 IST

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్‌ 1న టోల్‌ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్‌-విజయవాడ (65) జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, అదే విధంగా బస్సు, ట్రక్కులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు రూ.35, రూ.50 చొప్సున పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుంలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. స్థానికుల నెలవారీ పాస్‌ను రూ.330 నుంచి 340కి పెంచారు. విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ ప్లాజా మీదుగా రోజుకు సుమారు 40 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. వారాంతపు దినాల్లో, శుభకార్యాలు అధికంగా ఉన్నప్పుడు మరో 5 వేల వాహనాలు అదనంగా వెళతాయి. ఈ సంక్రాంతి పండగకు ఒక్కరోజే 77 వేల పైచిలుకు వాహనాలు ప్రయాణించాయి. పెరిగిన టోల్‌ ధరలతో సామాన్యులపై భారం పడనుంది. 2025 మార్చి 31 వరకు పెరిగిన ధరలు అమలులో ఉండనున్నాయి. ఫాస్టాగ్‌ అమల్లోకి వచ్చాక టోల్‌ ప్లాజాల వద్ద వసూళ్లు కూడా భారీగా పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని