అంజి ‘అని’ తలిస్తే చాలు..

ఆయన.. ‘ముఖ్య’నేతకు సోదరుడు. ఆ నాయకుడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక చోరుడిగా అవతారమెత్తారు. ఈ అడ్డగోలు దందాను చక్కబెట్టేందుకు అక్రమ సొమ్మును చుట్టచుట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించుకున్నారు.

Updated : 16 Apr 2024 12:59 IST

‘ముఖ్య’నేత సోదరుడి కనుసన్నల్లో అక్రమ దందా
అన్నీ తానై నడిపిస్తున్న అంజిరెడ్డి
అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు
అడ్డుకోని ఉన్నతాధికారులు
తనిఖీలకు వెళ్లే సిబ్బందికి సీఎంవో నుంచే ఫోన్లు
ఈనాడు, అమరావతి

ఆయన.. ‘ముఖ్య’నేతకు సోదరుడు. ఆ నాయకుడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక చోరుడిగా అవతారమెత్తారు. ఈ అడ్డగోలు దందాను చక్కబెట్టేందుకు అక్రమ సొమ్మును చుట్టచుట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించుకున్నారు. ఆ వ్యక్తి ఇక్కడ కాదు.. అక్కడ కాదు.. ఏకంగా సీఎంవోలోనే తిష్ఠ వేశారు. ఆ కార్యాలయం నుంచే చక్రం తిప్పుతూ గనుల శాఖ అధికారులను గడగడలాడిస్తున్నారు. ఎంతలా అంటే.. రీచ్‌ల తనిఖీలకు వెళ్లిన అధికారులు, సిబ్బంది సైతం ఏమీ చేయలేక వెనక్కి రావాల్సిందే. ఉన్నతాధికారులతో చీవాట్లు తినాల్సిందే.

  • రాష్ట్రంలో ఎన్నో ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు లేవు. అయినా ఆ రీచ్‌ల్లో ఒక్కరోజు కూడా తవ్వకాలు ఆగలేదు.
  • కేవలం కూలీలతోనే(మాన్యువల్‌గా) ఇసుక తవ్వకాలు జరిపేలా రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(సియా) గత నెల ఇసుక రీచ్‌లకు అనుమతి ఇచ్చింది. ఇసుకాసురులు దాన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు.
  • పలు రీచ్‌ల్లో పాత అనుమతులతో జరుగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని, కొత్తగా అనుమతులు తీసుకోవాలని ఏడాది క్రితం జాతీయ హరిత ట్రైబ్యునల్‌  (ఎన్‌జీటీ) ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై హైకోర్టు పలుమార్లు చీవాట్లు కూడా పెట్టింది. ఇసుక అక్రమ తవ్వకందారులకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదు.

ఇసుకాసురులకు ఇంత ధైర్యం ఎక్కడిది..?
ఎవరినీ ఖాతరు చేయకుండా ఇసుకను ఎలా తవ్వి తీసుకెళ్తున్నారు..?
అధికారులు ఎందుకు అడ్డుకునే సాహసం చేయలేకపోతున్నారు..?

ఈ ప్రశ్నలన్నింటికీ వినిపించే ఒకే ఒక సమాధానం.. అంజిరెడ్డి

ఇసుక అక్రమ వ్యాపారంలో ఆయన మాటే శాసనం. ఆయన చెప్పారంటే జరిగి తీరాల్సిందే. లేదంటే నాశనమవ్వాల్సిందే..! ఆయనను ప్రసన్నం చేసుకుంటే అనుమతులు, నిబంధనలు అన్న గొడవే ఉండదు! కోర్టు ఆదేశాలు, ఆంక్షలు ఉన్నా.. పట్టించుకోనక్కరలేదు. ‘‘ఎక్కడైనా ఇసుక తవ్వుకోండి.. ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోండి.. ఎవరూ అడ్డుకోరు.. ఎవరైనా ఆపితే నా పేరు చెప్పండి’’ అని అభయం ఇస్తారు. ఇంతలా పెత్తనం చెలాయిస్తున్న ఆయన.. ప్రజాప్రతినిధో, ఇసుక గుత్తేదారో, బడా సంస్థ ప్రతినిధో కాదు. అయినా ఇసుక వ్యాపారాన్నంతటిని తన గుప్పిట పెట్టుకున్నారు. ఆయన పేరే.. అంజిరెడ్డి. రాష్ట్రంలో ఇసుక దందా, అందులో భారీ దోపిడీకి ‘ముఖ్య’నేత సోదరుడు  తెర వెనుక స్కెచ్‌ వేస్తే.. అంజిరెడ్డి తెర ముందుండి నడిపిస్తారు.

పేరుకే సంస్థలు.. పెత్తనమంతా ఆయనదే..

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను 2021 మే నుంచి జేపీ సంస్థ పేరిట నిర్వహించగా.. చెన్నై మైనింగ్‌ వ్యాపారికి చెందిన టర్న్‌కీ సంస్థ ఉపగుత్తేదారుగా వ్యవహరించింది. అది ప్రభుత్వ పెద్దలకు భారీగా కప్పం కడుతూ అడ్డగోలుగా దోచేసింది. ఈ క్రమంలో ఇసుక నుంచి భారీగా డబ్బులు పిండుకోవాలని ‘ముఖ్య’నేత సోదరుడు పన్నాగం పన్నాడు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టి దాని ద్వారా వచ్చే అక్రమ సొమ్మును దండుకోవడానికి ప్రత్యేకంగా అంజిరెడ్డి అనే వ్యక్తిని నియమించుకున్నాడు. రాష్ట్రంలోని ఇసుక వ్యాపారులు అంతా ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. వాస్తవానికి 2023 మే నెలతోనే జేపీ సంస్థ టెండరు ముగిసింది. అయినా.. నవంబరు వరకు దాని పేరిటనే బిల్లులు జారీ చేస్తూ వచ్చారు. అయితే గత డిసెంబరు నుంచి వేరే రెండు సంస్థలు ఇసుక టెండరును దక్కించుకున్నట్లు రికార్డుల్లో చూపారు. కానీ కప్పమంతా వెళ్లేది ‘ముఖ్య’నేత సోదరుడి చెంతకే. ఆయన సూచనలతో అంజిరెడ్డి ఈ అక్రమ వ్యవహారాన్ని అంతా తానై చూసుకుంటున్నాడు.

ఎవరీ అంజిరెడ్డి?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ మాజీ ఎంపీ వద్ద చాలాకాలం పనిచేశారు. తర్వాత ఏపీలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ గ్రూప్‌లో అసోసియేట్‌ జనరల్‌ మేనేజరుగా కొనసాగారు. ఆ గ్రూప్‌కి జగన్‌ ప్రభుత్వం మన రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు కట్టబెట్టింది. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ మేనేజర్‌, ఒక్కో రీజియన్‌కు ఒక్కో రీజియన్‌ మేనేజర్‌ చొప్పున కార్పొరేట్‌ స్థాయిలో నియమించుకొని అంజిరెడ్డి ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఇలా ఇసుక అక్రమ దందాలో ‘ముఖ్య’నాయకుడు.. అంజిరెడ్డిని అడ్డుపెట్టుకుని ప్రతి నెలా రూ. కోట్లు సంపాదిస్తూ సహజ వనరులను విధ్వంసం చేస్తున్నారు.

సీఎంవోలోనే మకాం..

అంజిరెడ్డి నిత్యం ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లోనే ఉంటూ హల్‌చల్‌ చేస్తుంటాడు. సీఎం క్యాంపు కార్యాలయంలోని ఓ కీలక అధికారితో ఆయన భేటీ అయ్యాడంటే చాలు.. మిగిలిన వారు ఎంతసేపైనా బయట వేచి ఉండాల్సిందే. జిల్లాల్లో ఇసుక తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నించినా, పర్యావరణ అనుమతుల గురించి అడిగినా.. వెంటనే సీఎంవో నుంచి నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్లు వెళ్తాయి.

అనుమతులతో పనిలేదు..

అంజిరెడ్డి ఈ వ్యవహారం చూస్తున్న రోజు నుంచి.. అనుమతులు లేకపోయినా రాష్ట్రవ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు మొదలయ్యాయి. ఈ తవ్వకాలపై మరోసారి సమీక్ష జరపాలని, కొత్తగా పర్యావరణ అనుమతులు జారీ చేయాలంటూ ఎన్‌జీటీ గతేడాది మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. రాష్ట్రంలోని 110 రీచ్‌ల్లో తక్షణమే ఇసుక తవ్వకాలు ఆపేయాలంటూ గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(సియా).. ఇసుక గుత్తేదారు జేపీ సంస్థకు, గనుల శాఖకు ఆదేశాలిచ్చింది. అయినా.. అంజిరెడ్డి ఎక్కడా తవ్వకాలు ఆపలేదు. సియా అటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా బయటకు పొక్కకుండా చూశాడు. సుప్రీంకోర్టు సైతం సియా ఆదేశాలనే పాటించాలని ఆదేశించింది. తర్వాత కూడా తవ్వకాలను నిలిపేయకపోగా.. యథేచ్ఛగా కొనసాగించారు. కేవలం కూలీలతోనే ఇసుకను తవ్వాలన్న సియా నిబంధనలను సైతం తుంగలో తొక్కారు. పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి లారీల్లో లోడ్‌చేస్తూ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తెలిసినా కిమ్మనని అధికారులు

కలెక్టర్లు సహా గనుల శాఖ, రెవెన్యూ, ప్రత్యేక కార్యదళం (ఎస్‌ఈబీ), కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులకు ఈ అక్రమాల గురించి తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయడంలేదు. అంజిరెడ్డి నేరుగా సీఎంవో నుంచి ఫోన్‌ చేయించి ఒత్తిడి తీసుకొస్తారన్న గుబులుతోనే అధికారులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు.

  • కృష్ణా జిల్లా రొయ్యూరు ఇసుక రీచ్‌లో కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారన్న సమాచారం మేరకు జిల్లా గనుల శాఖ అధికారులు కొన్ని నెలల క్రితం తనిఖీలకు వెళ్లారు. అక్కడే ఉన్న వైకాపా ఇసుకాసురులు వారిపై బెదిరింపులకు దిగారు. ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు? తనిఖీ చేయమని ఎవరు చెప్పారు? మీరు వస్తున్నారన్న విషయం మీ శాఖ సంచాలకునికి తెలుసా? ఈ రీచ్‌లు ఎవరివి అనుకుంటున్నారు?’ అంటూ వారిపై దాడికి పాల్పడినంత పనిచేశారు.
  • పల్నాడు జిల్లాలోని ఓ ఇసుక రీచ్‌లో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని తెలియడంతో కొన్ని నెలల క్రితం ఎస్‌ఈబీ ఎస్సై, కానిస్టేబుళ్లు అడ్డుకునేందుకు వెళ్లారు. వెంటనే వారికి ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో వారు చేతులుముడుచుకుని వెళ్లిపోక తప్పలేదు.
  • గతేడాది జూన్‌, జులై నెలల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని గనుల శాఖ అధికారులు జొన్నాడ, ఓబుల్లంక రీచ్‌ల్లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ శాఖ ఉన్నతాధికారి ఆ అధికారులకు ఫోన్‌ చేసి వెంటనే  వెనక్కి వచ్చేయాలంటూ ఒత్తిడి చేశారు.
  • కొన్ని నెలల క్రితం ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా ఇసుక తవ్వకాలు సాగాయి. ఇసుకను అక్రమంగా ఎందుకు తవ్వుతున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తే.. తాము సీఎంవోకు చెందినవారమంటూ బెదిరిస్తూ తమ దందాను యథేచ్ఛగా కొనసాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని