నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు.
ఐదేళ్లుగా దళిత, గిరిజనులకు జగన్ నమ్మకద్రోహం
వారి ప్రత్యేక సంక్షేమ పథకాల రద్దు
విద్య, ఉపాధి అవకాశాలపై దెబ్బ
రాజ్యాంగ హక్కులనూ కాలరాశారు
వారికి నాణ్యమైన బతుకే లేకుండా చేసిన దుర్మార్గం
విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు తీసేసే బరితెగింపు
ఈనాడు, అమరావతి
నోరు తెరిస్తే... నా ఎస్సీలు, నా ఎస్టీలని బాకా...
వారి మద్దతుతోనే అధికారంలోకి వస్తానని ధీమా...
కానీ... ఐదేళ్ల పాలనలో
వారికి ఎకరం పొలం ఇవ్వాలన్నా చేయిరాలేదు
స్వయం ఉపాధి రుణాలివ్వటానికి మనసొప్పలేదు
ఉన్నత చదువుల ఆశలకు గండికొట్టారు...
విదేశీ విద్య పథకాన్ని అటకెక్కించారు...
అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లను నామమాత్రం చేశారు...
సంక్షేమ వసతి గృహాలను వదిలేశారు...
ఇన్ని రకాలుగా నిరు పేదలను చావుదెబ్బ కొట్టి...
నా ఎస్సీలు, నా ఎస్టీలంటూ రాగం అందుకోవడం జగన్కే చెల్లింది!
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. వారి కోసమే దశాబ్దాలుగా అమలైన పథకాలను రద్దు చేశారు. వారి బిడ్డలకు ఉన్నత చదువులు అందే అవకాశాలు మొదలు... సంక్షేమం వరకు అన్నింటికీ పాతరేశారు. వారి అభివృద్ధికి మాత్రమే ప్రత్యేకంగా వినియోగించాల్సిన ఉపప్రణాళిక నిధులనూ మళ్లించారు. అందరికీ ఇచ్చే పింఛన్లు, ఉపకార వేతనాలు, ఇతర పథకాలకే వారిని పరిమితం చేశారు. ఇదే గొప్ప సాయమంటూ ప్రచారం చేసుకున్నారు. ఐదేళ్లుగా ‘నా ఎస్సీలు... నా ఎస్టీలు’ అంటూ గుండెలు బాదుకుంటూనే జగన్ చేసిన ద్రోహమిది. చరిత్రలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రీ చేయని దారుణమిది.
జగన్ దెబ్బ-10
కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత
వైద్య రంగానికి రాష్ట్రంలో తానే పురుడు పోసినట్టు ప్రగల్భాలు పలికే జగన్... కొత్త వైద్య కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు దక్కకుండా కుతంత్రాన్ని నడిపారు. వాటిలో 50శాతం సీట్లు అమ్మకానికి పెట్టారు. అంటే ఆ మేరకు రిజర్వేషన్లోనూ కోత పడినట్లే. డబ్బు పెట్టి సీటు కొనగలిగే స్తోమత ఎస్సీ, ఎస్టీలకు ఉంటుందా? ఉన్నా అది ఎంత మందికి సాధ్యం...? ఇది తెలిసీ తన నిర్ణయాన్ని అమలు చేశారంటే అణగారిన వర్గాలకు వైద్య విద్య అందకూడదనే కదా?
జగన్ దెబ్బ-9
ప్రైవేటు పీజీ చదువులపైనా కత్తి
ఎస్సీ, ఎస్టీల ఉన్నత విద్యకు కేంద్రమిచ్చే ఆర్థిక సాయాన్ని కూడా తన ఖాతాలోకి వేసుకున్న ప్రభుత్వమిది. పైగా ఏ ప్రభుత్వమూ విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్మెంటే ఇవ్వలేదన్నట్లుగా జగన్ ఇన్నాళ్లూ కట్టుకథలు చెప్పారు. అంతటితోనే ఆగకుండా ఎస్సీ, ఎస్టీలు ప్రైవేటుగా పీజీ చదివేందుకు గత ప్రభుత్వాలు అందించిన చేయూత కూడా లేకుండా చేశారు. ప్రైవేటులో పీజీ చదివే వారికి ఫీజు రీయింబర్స్మెంటును సైతం రద్దు చేశారు. అంటే వారు ఉన్నత విద్య చదవడం ఆయనకు ఇష్టం లేనట్టే కదా?
జగన్ దెబ్బ-8
అవన్నీ సంక్షోభ వసతి గృహాలు
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయని వైకాపా ప్రభుత్వమే సర్వే చేయించి తేల్చింది. నాడు-నేడు కింద రూ.3,300 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఏడాది క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు ఆయా పనులకు అతీగతీ లేదు. విద్యార్థులు ఉండటానికి సరైన వసతి లేదు. కొన్నిచోట్ల ఒకే గదిలో పిల్లల్ని కుక్కుతున్నారు. చాలాచోట్ల సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. దుప్పట్లు, దోమతెరల మాట దేవుడెరుగు చాలాచోట్ల తినడానికి పళ్లాలు, నీళ్లు తాగేందుకు గ్లాసులూ సరిపడా లేని దుస్థితి. అయినా జగన్ పట్టించుకున్న దాఖలాలే లేవు. మరో దారుణమైన విషయమేంటంటే... విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను నాలుగు నెలలుగా చెల్లించడంలేదు. ఇన్ని దారుణాలకు ఒడిగట్టిన జగన్ తాను పిల్లలకు మేనమామనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆఖరికి వంట చేసుకోడానికి సరిపడా గ్యాస్ కూడా ప్రభుత్వం అందించడం లేదు. పిల్లలే బయటకు వెళ్లి వంటచెరకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. బడుగు, బలహీనవర్గాల పిల్లల్ని జగన్ ఎంతగా క్షోభకు గురిచేస్తున్నారో... ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి?
జగన్ దెబ్బ-7
సివిల్స్లో శిక్షణకు విముఖత
తెదేపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులుగా మారితే చూడాలని కలలుకంది. అందుకే సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా కోరుకున్నచోట ఉచితంగా నాణ్యమైన శిక్షణ ఇప్పించింది. ఒక్కో విద్యార్థిపై రూ.80 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు ఖర్చు చేసింది. పుస్తకాలు, మెటీరియల్, ఇతర ఖర్చులకు నెలనెలా రూ.12 వేల చొప్పున 9 నెలలపాటు అందించింది. మొత్తంగా 1,200 మంది ఎస్సీ విద్యార్థులకు, 910 మంది గిరిజన విద్యార్థులకు శిక్షణ అందించింది. జగన్ అధికారంలోకి రాగానే దీన్ని కూడా రద్దు చేశారు.
జగన్ దెబ్బ-6
పోటీలో నిలవకుండా కుట్ర
పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా అందించేందుకు ఏర్పాటైన అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లను కూడా నామమాత్రంగా మార్చేశారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. తెదేపా హయాంలో వీటి ద్వారా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, డీఎస్సీ, బ్యాంకు క్లర్క్, పీవో, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్-డి(రైల్వే), ఇతర పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చారు. అప్పట్లో విజయవాడలో శిక్షణ తీసుకున్న 385 మంది విద్యార్థుల్లో 121 మంది, తిరుపతిలో 402 మందిలో 78 మంది ఉద్యోగాలు సాధించారు. విశాఖ స్టడీ సర్కిల్లోనూ వందల మందికి శిక్షణ అందించారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత మొదటి రెండేళ్లు స్టడీ సర్కిళ్లను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒకసారి మాత్రమే సివిల్ సర్వీసెస్కు, గ్రూప్-1, బ్యాంకు పీవో ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించినా అది నామమాత్రమే.
జగన్ దెబ్బ-5
విదేశీ విద్యకు కొర్రీలు
తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించి, వారు గొప్పగా జీవించేలా చేయాలనేది తల్లిదండ్రుల కల. దాన్ని నెరవేర్చేందుకు గత ప్రభుత్వాలు చేసిన సాయాన్ని జగన్ వారికి దూరం చేశారు. దళిత, గిరిజన బిడ్డలు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఆ పథకానికి ఉండే అంబేడ్కర్ పేరును తీసేసి తన పేరును పెట్టుకున్నారంటేనే ఆయన ఆలోచన తీరేంటో ఇట్టే తెలిసిపోతుంది. 15 దేశాల్లో కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు తెదేపా ప్రభుత్వం అవకాశం కల్పించి 2014-19 మధ్య 491 మందికి ఆర్థికసాయం అందించింది. జగన్ అధికారంలోకి వచ్చాక మూడేళ్లపాటు పథకాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత కూడా ఎక్కడలేని నిబంధనలు తెచ్చి అర్హుల సంఖ్యను కుదించారు. క్యూఎస్ ర్యాకింగ్లో టాప్ 200లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని మొదట ప్రకటించారు. ఆ తర్వాత నిబంధనలు మరింత కఠినతరం చేసి టాప్-50 ర్యాంకుల్లో(సబ్జెక్టుల వారీగా) సీటు పొందిన వారికి మాత్రమే సాయం చేస్తామన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయమే జరిగింది. వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు విదేశీ విద్య కింద సాయానికి అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులు 50 మందికి కూడా మించలేదు. ఇక అర్హత సాధించిన ఎస్టీ విద్యార్థులు ఎందరో తెలుసా? ఒక్కరంటే ఒక్కరే. జగన్ చేసిన దారుణానికి ఇంతకంటే రుజువు ఏంకావాలి?
జగన్ దెబ్బ-4
కేంద్ర సాయానికీ మోకాలడ్డు
జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్ఎస్ఎఫ్డీసీ), జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ(ఎన్ఎస్టీఎఫ్డీసీ)లు ఎస్సీ, ఎస్టీలకు అందించే రుణాలకూ రాష్ట్రం మోకాలడ్డింది. కేంద్రమిచ్చే నిధులకు తనవంతు వాటా కలిపి రుణాలివ్వకుండా... దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళం పాడింది. ఈ సంస్థలు టర్మ్ లోన్ పేరిట గరిష్ఠంగా రూ.50 లక్షలు, సూక్ష్మరుణం కింద రూ.3 లక్షల వరకు ఇస్తాయి. రాయితీ గరిష్ఠంగా 50% ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర సంస్థలు ఇచ్చే 60% రుణానికి... రాష్ట్రం 35% రాయితీని జోడించి ఇవ్వాలి. లబ్ధిదారుడి వాటా 5%. కానీ, వైకాపా ప్రభుత్వం రాయితీ ఇవ్వకుండా పూర్తిగా పథకాలనే నిలిపేసింది. 2015-19 మధ్య రాష్ట్రంలో 23 వేల మంది ఎస్సీ, ఎస్టీలకు రూ.515 కోట్లకుపైనే సాయం అందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్టీఎఫ్డీసీ టర్మ్ రుణాల కింద ఏపీకి రూ.6.54 కోట్లు కేటాయించినా రాష్ట్రం రాయితీ ఇవ్వలేదు. గిరిజనుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు మొత్తం ప్రక్రియనే నిలిపేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్నాయని జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రమిచ్చిన రూ.38 కోట్లతో ఇటీవల 100 మందికి మురుగు శుద్ధి వాహనాలను పంపిణీ చేశారు. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
జగన్ దెబ్బ-3
స్వయం ఉపాధికి చెల్లు
సొంత కాళ్లపై నిలబడి పేదరికం నుంచి బయటపడేందుకు అణగారిన వర్గాలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు తిరుగులేని దన్నుగా నిలుస్తాయి. ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి అవకాశాల కల్పనకు ఉద్దేశించిన స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాన్ని జగన్ తీసేశారు. తెదేపా ప్రభుత్వంలో 40-90% రాయితీతో రూ.1-5 లక్షల వరకు రుణాలుగా ఇచ్చారు. ఏటా లక్షల మంది లబ్ధిపొందారు. ఇదేకాకుండా రూ.85 కోట్లు ఖర్చు చేసి 1,739 మందికి ఏడు సీట్ల కార్లను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించారు. కానీ, జగనేం చేశారో తెలుసా? 2019లో 3.15 లక్షల మంది ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానించి ఒక్కరికంటే ఒక్కరికి కూడా రాయితీ రుణాలు అందించలేదు. పైగా తెదేపా ప్రభుత్వం ఎస్సీలకు ఉపాధి కల్పించేందుకు వినియోగించిన రూ.200 కోట్లు బ్యాంకుల్లో ఉంటే తీసేసుకుని ఇతర పథకాలకు మళ్లించారు.
జగన్ దెబ్బ-2
సాగుకు సెంటు భూమీ ఇవ్వలేదు
భూమి ఉన్న వారి జీవితాలకు ధీమా దక్కుతుంది. ఎస్సీల జీవనానికి భరోసా కల్పించడానికి గత ప్రభుత్వాలు తపనపడ్డాయి. వారికి మేలు చేకూర్చేందుకు శతథా ప్రయత్నించాయి. అందులో భాగంగా 30 ఏళ్లుగా ఎస్సీల కోసం వివిధ ప్రభుత్వాలు అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని జగన్ రద్దు చేశారు. ఈ పథకం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం ఎకరం పొలాన్ని కొనుగోలు చేసి, సాగుకు అనుకూలంగా మార్చి ఇవ్వాలి. 1988 నుంచి 2019 వరకు 23,802 మంది ఎస్సీ మహిళలకు 24 వేల ఎకరాలను అందించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఒక సెంటు సాగుభూమిని ఇవ్వలేదు. 2019 బడ్జెట్లో రూ.35 కోట్లు కేటాయించి, తర్వాత ఇతర పథకాలకు మళ్లించారు.
జగన్ దెబ్బ-1
బెస్ట్ ఎవైలబుల్ స్కూల్కు గండి
ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించి, ప్రోత్సహించేందుకు బెస్ట్ ఎవైలబుల్ స్కూల్ పథకాన్ని గత తెదేపా ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను జల్లెడ పట్టి వారు కోరుకున్న ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో చదివేందుకు అవకాశమిచ్చింది. వారికి పుస్తకాల నుంచి యూనిఫాం వరకు సమకూర్చింది. ఇలా 2014-19 మధ్య 1.40 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. ఈ ఒక్క పథకం కోసమే ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్... తొలి దెబ్బ వీరి మీదనే వేశారు. బెస్ట్ ఎవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేశారు. అంతేకాదు... పథకాన్ని కొనసాగించాలని ఎస్సీ సంఘాలు న్యాయస్థానంలో పోరాటం చేస్తే... జగన్ వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి చివరికి మొట్టికాయలు తిన్నారు. ఎస్సీ, ఎస్టీలపై ఎంత కక్ష ఉంటే వారి బిడ్డలకు అందే పథకాన్ని అమలు చేయకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వరకు వెళతారు? తెదేపా ప్రభుత్వం ఈ పథకాన్ని 3 నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తే... జగన్ 9, 10 తరగతులకే పరిమితం చేశారు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశించిందనే. లేదంటే దాన్ని కూడా కొనసాగించడం ఆయనకు ఇష్టమే లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ