అక్రమాల ‘కిరణం’!

అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్‌ ఎస్టేట్‌ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు.

Updated : 24 Apr 2024 05:42 IST

శ్రీకాకుళం జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి దందాలు
పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు స్వాహా
కప్పం కడితేనే వ్యాపారాలకు అనుమతి
ఈనాడు, అమరావతి

జిల్లా వెనకబడినా.. ఆయన మాత్రం అవినీతిలో ముందే ఉన్నారు..
ఉదయాన సూర్య కిరణాలు ఆరోగ్యకరం..
కానీ, ఈ ప్రజాప్రతినిధి అనే ‘కిరణం’ మాత్రం హానికరం.
అధికారాన్ని బూచీగా చూపిస్తూ..  
సామాన్యులనే సమిధలుగా చేస్తూ..
కొండలను కరిగిస్తూ..
వ్యాపారులను పిప్పి చేస్తూ..
ఇసుకను తోడేస్తూ..
కొలువుల పేరిట నిరుద్యోగులను దోచేస్తూ..
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ..
పైసా లేని స్థితి నుంచి..
ధనరాశులతో తులతూగే స్థాయికి ఎదిగారు.

వినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్‌ ఎస్టేట్‌ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేయని అక్రమం లేదు. తన అరాచకాలకు అడ్డు లేకుండా.. నియోజకవర్గ వ్యాప్తంగా రౌడీ మూకల్ని ఏర్పాటు చేసుకుని బెదిరింపులకు తెగబడ్డారు. ఎదురుచెప్పిన వారిని భయాందోళనకు గురిచేశారు. అధికార యంత్రాంగం సాయంతో అక్రమ వసూళ్లకు తెగబడ్డారు. భారీగా భూములు, బంగారం కూడబెట్టారు. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేశారు. ఆయన స్వగ్రామంలోనూ రూ.కోట్లు వెచ్చించి ఇల్లు కట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గానికి చెందిన వైకాపా ప్రజాప్రతినిధి దందా ఇదీ..  


వెంచర్‌ వేయాలంటే కప్పం కట్టాల్సిందే..

ఈ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నగరాలకు అందుబాటు దూరంలో ఉంటుంది. దీంతో ఇక్కడ భూముల ధరల మాదిరే స్థిరాస్తి లావాదేవీలూ విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఎవరైనా వెంచర్‌ వేయాలంటే ఆ ప్రజాప్రతినిధి అడిగినంత కప్పం కట్టాల్సిందే. అందుకు అంగీకరించని వారిని అధికారుల సాయంతో ఇబ్బంది పెడుతుంటారు. సొమ్ములు చెల్లించిన తర్వాతే వెంచర్‌ కార్యకలాపాలు జరిగేది. విద్యాసంస్థలకు కేంద్రమైన ఓ ప్రాంతంలో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా, వెంచర్‌ వేసినా, అపార్ట్‌మెంట్‌ నిర్మించినా అందులో ఏదో ఒక కారణం చూపి వసూళ్లు చేశారు. ఆ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడే ఈ దందాలు నిర్వహిస్తున్నారు.


పేదలు బాగు చేసుకున్న భూములు లాక్కొని..  

నియోజకవర్గంలోని ఓ గ్రామం పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. తెదేపా హయాంలో ఆ గ్రామస్థులు చందాలు వసూలు చేసుకుని ఓ 50 ఎకరాలు బాగు చేసుకున్నారు. దాన్ని భూమి లేని పేదలంతా సాగు చేసుకోవాలనుకున్నారు. ఈ ప్రజాప్రతినిధి గెలిచిన వెంటనే ఆ భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్‌ వేసి తన ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అందులో కొబ్బరి సాగు చేస్తున్నారు. మండల పరిషత్‌ నిధులతో ఆ తోటకు కంకర రహదారి నిర్మించుకున్నారు. కుటుంబ సభ్యులకు చెందిన భూమిని కూడా అందరికీ పంచకుండా, అధికార బలంతో ఆయనొక్కరే నొక్కేశారు.  


క్రమబద్ధీకరణ పేరిట భారీ దోపిడీ

కొన్నాళ్ల కిందట ప్రభుత్వం 246 ఎకరాల భూములకు సంబంధించి డీ పట్టాలు పంపిణీ చేసింది. ఆ లబ్ధిదారుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారీ నేత. ఆ భూముల క్రమబద్ధీకరణలోనూ పెద్ద ఎత్తున దండుకున్నారు. జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఒక నాయకుడికి చెందిన భూమి విక్రయం విషయంలో సుమారు రూ.20 కోట్లు ఆర్జించారు. చెరువు గట్లను పూడ్చేసి ఈ భూమికి రహదారిగా చూపారు. ఉపాధి హామీ పథకం కింద రూ.31 లక్షలతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టించి మంజూరు చేయించుకున్నారు. ఈ రోడ్డు నిర్మిస్తే చిక్కులు వస్తాయని అధికారులు వెనకడుగు వేయడంతో పనులు ప్రారంభం కాలేదు.

ఓ పత్రిక కార్యాలయం పక్కన మూడేళ్ల కిందట కొంతమంది వ్యాపారులు కలిసి 42 ఎకరాల్లో వెంచర్‌ వేశారు. అందులో డీ పట్టా భూమి ఉందంటూ ఆ యజమానులను బెదిరించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజేశారు. సెటిల్‌మెంట్లలోనూ ఆయన తీరు భిన్నంగా ఉంటుందని చెబుతుంటారు.


కొండలు పిండి చేసిన ఘనులు

నియోజకవర్గంలోని కొండలన్నింటినీ ఈ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు పిండిచేసేశారు. కంకర, మట్టి పెద్దఎత్తున తరలించి రూ.లక్షలు ఆర్జించారు. ఓ కొండను మేనల్లుడు తీసుకున్న అనుమతికి మించి తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఇసుక ర్యాంపు ప్రారంభించి విజయనగరం, విశాఖ నగరాలకు అక్రమంగా తరలించారు. మధ్యలో కొంత సమయం ఆగినా.. ఇటీవల మళ్లీ అక్కడి నుంచే రవాణా సాగిస్తున్నారు.


సొమ్ములిస్తేనే ఉద్యోగం

  • విద్యుత్తు షిఫ్టు ఆపరేటర్ల పోస్టులు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారీ నేత. కొందరికి ఇప్పించినా.. చాలామందికి మొండిచేయి చూపారు. వారికి డబ్బులూ తిరిగివ్వకపోవటంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు.
  • అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టుల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5- రూ.8 లక్షలు వసూలు చేశారు. ఆశా కార్యకర్తల నియామకాల్లోనూ డబ్బులు వసూలు చేశారు.
  • స్థానిక పరిశ్రమల్లో ఈయన సోదరుడికి కాంట్రాక్టులు ఇప్పించారు. ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే అందుకయ్యే ఖర్చులను కూడా ఆయా పరిశ్రమల
  • నుంచే వసూలు చేస్తున్నారు.

హత్యాయత్నంలో ప్రమేయం!

  • గతేడాది ఓ పత్రిక విలేకరి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. దీనికి ఆ ప్రజాప్రతినిధి, ఆయన ప్రధాన అనుచరుడే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు.
  • నియోజకవర్గ పరిధిలోని ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధిపై కొన్నాళ్ల కిందట హత్యాయత్నం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన నిర్వహించారు.
  • అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలోని పలువురు మహిళల్ని ఈ ప్రజాప్రతినిధి వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన అనుచరుడొకరు ఓ మహిళకు ఫోన్‌ చేసి.. ‘సార్‌ మీ ఫొటో చూసి ఇంట్రస్ట్‌గా మాట్లాడారు’ అని చెప్పిన ఓ ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారడం గమనార్హం.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని