Raghurama: జగన్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలి

‘నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో 2021 మే నెలలో ఏపీ పోలీసులు నన్ను అరెస్టు చేసి కస్టడీలో హింసించారు. గుండె శస్త్రచికిత్స చేసుకున్నానని చెప్పినా, మందులివ్వకుండా నిరాకరించారు.

Updated : 11 Jun 2024 06:18 IST

ఐపీఎస్‌లు సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు, విజయపాల్‌పై కూడా..
నన్ను చంపేందుకు కుట్ర పన్నారు
ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తప్పుడు నివేదిక 
గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు 

ఈనాడు, అమరావతి: ‘నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో 2021 మే నెలలో ఏపీ పోలీసులు నన్ను అరెస్టు చేసి కస్టడీలో హింసించారు. గుండె శస్త్రచికిత్స చేసుకున్నానని చెప్పినా, మందులివ్వకుండా నిరాకరించారు. చంపేందుకు ప్రయత్నించారు. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఐపీఎస్‌లు పీవీ సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు, ఆర్‌.విజయపాల్, గుంటూరు జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, ఇతర అధికారుల పాత్ర ఉంది. ఈ ఆరోపణలను నిరూపించే ఆధారాలన్నీ సమర్పిస్తున్నాను. జగన్‌తో పాటు ఆ అధికారులందరిపై హత్యాయత్నం కేసు పెట్టి, నాకు న్యాయం చేయండి’ అని ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కె.రఘురామకృష్ణరాజు కోరారు. జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను కాలరాశారని, ఇందులో నాటి సీఎం జగన్, పోలీసు అధికారుల కుట్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గుంటూరు ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్న ప్రకారం..

 ఇది కచ్చితంగా హత్యాయత్నమే

2021 మే 14న సీఐడీ అధికారులు నాపై ఓ తప్పుడు కేసు పెట్టారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో నన్ను అరెస్టు చేశారు. న్యాయసూత్రాల ప్రకారం వైద్య పరీక్షలు చేయించాక, అక్కడే మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలి. అలాకాకుండా బలవంతంగా నెట్టుకుంటూ పోలీసు వాహనంలో ఎక్కించుకొని రాత్రి 9.30కు గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు.

  • అంతకు కొద్దివారాల క్రితమే గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో కోలుకుంటున్న దశలో ఆ రాత్రి నాకు మంచినీళ్లు, మందులు ఇవ్వలేదు. నేను ఎంపీని అయినప్పటికీ అరెస్టుకు ముందు లోక్‌సభ స్పీకర్‌ అనుమతి తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగిరీ పోలీసు భద్రతను లేకుండా చేసి, రాత్రి సీఐడీ కస్టడీలో హింసించారు. 
  • రాత్రి 11.30కు సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు, ఇతర పోలీసులు వచ్చి నా కాళ్లను తాళ్లతో కట్టేసి కదలనివ్వకుండా చేశారు. రబ్బరు బెల్ట్, లాఠీలు, ఇతర ఆయుధాలతో అరగంట పాటు కొట్టారు. పాదాల్లోంచి రక్తం కారుతూ నొప్పి పుట్టడంతో ఏడ్చాను. ఆ రాత్రంతా ఐదు సార్లు ఇలాగే కొట్టారు. దుర్భాషలాడారు. జగన్‌ను విమర్శిస్తున్నందుకు చంపేస్తానని సునీల్‌కుమార్‌ నేరుగా బెదిరించారు. హింసిస్తున్న వీడియోను ఓ అధికారి సీఎం జగన్‌కు చూపించారు. మరో పోలీసు అధికారి కింద కూర్చొని నా గుండెపై బాదుతూ, చంపేసి.. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నా ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పేవరకూ కొట్టారు. మంచం మీద కూర్చోబెట్టి కొట్టగా, ఆ మంచం విరిగిపోయింది. ఈ దురాగతానికి పాల్పడ్డ అధికారులను గుర్తించగలను.
  • మరునాడు ఈ విషయమంతా కోర్టులో వివరించాను. రికార్డు చేసిన మేజిస్ట్రేట్‌.. నన్ను పోలీసు/ జ్యుడిషియల్‌ కస్టడీకి ఇవ్వకుండా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి పంపించారు. ఆ రాత్రి అంటే, మే 15న సీఐడీ విభాగాధిపతి సునీల్‌కుమార్‌ ఆస్పత్రికి వచ్చి ‘పోలీసుల హింసలో గాయపడ్డట్టుగా ఎలాంటి నివేదికా ఇవ్వొద్ద’ని వైద్యులను బెదిరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి పోలీసులతో కుమ్మక్కై శరీరంపై ఎలాంటి గాయాల్లేవని నివేదిక ఇచ్చారు.
  • పోలీసుల క్రూరత్వంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ న్యాయస్థానం ఆదేశాల మేరకు నన్ను గుంటూరు ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌ మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. తర్వాత బెయిల్‌ కూడా సుప్రీంకోర్టే మంజూరు చేసింది. గుంటూరు వైద్యులు ఇచ్చిన నివేదికకు భిన్నంగా, నా పాదాలపై గాయాలున్నట్లు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తేల్చారు. ఒక ఎంపీపై పోలీసులు ఇంత పైశాచికంగా వ్యవహరించినా సీఎం జగన్‌ ప్రమేయంతో వారిపై కేసులు పెట్టలేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని