Sundar Pichai: లేఆఫ్‌ల వేళ.. సుందర్‌ పిచాయ్‌కి ₹1850కోట్ల పారితోషికం

ఆర్థిక మాంద్యం భయాలతో ఆల్ఫాబెట్‌లో పెద్ద సంఖ్యలో లేఆఫ్‌లు చేపడుతున్న వేళ.. ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) గతేడాదికి గానూ 226 మిలియన్‌ డాలర్ల పారితోషికం అందుకున్నారు.

Published : 22 Apr 2023 11:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ (Alphabet) సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) 2022 సంవత్సరానికి గానూ 226 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కంపెనీలో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక, ఈ పారితోషికంలో 218 మిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు ఉన్నాయి.

మూడేళ్ల కాలానికి సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) ఈ స్టాక్‌ అవార్డును అందుకున్నారు. 2019లోనూ ఆయన ఇదే స్థాయిలో ప్యాకేజీ తీసుకున్నారు. ఆ ఏడాది స్టాక్‌ అవార్డుల రూపంలో ఆయనకు 281 మిలియన్‌ డాలర్ల పారితోషికం అందింది. ఇక, గత మూడేళ్లుగా పిచాయ్‌ స్థిరంగా 2 మిలియన్‌ డాలర్ల వార్షిక వేతనం అందుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.

అయితే, ఆర్థిక మాంద్యం భయాలతో గూగుల్‌ (Google)లో పెద్ద సంఖ్యలో లేఆఫ్‌లు చేపడుతున్న వేళ.. పిచాయ్‌ ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఖర్చు నియంత్రణలో భాగంగా 12వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆల్ఫాబెట్‌ (Alphabet) ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో ఇది 6 శాతం కావడం గమనార్హం. దీంతో ఉద్యోగులు నిరసన బాటపట్టారు. ఈ నెల ఆరంభంలో లండన్‌ కార్యాలయం నుంచి గూగుల్‌ (Google) ఉద్యోగులు వాకౌట్‌ చేశారు. అంతకుముందు మార్చిలో కంపెనీకి చెందిన జ్యూరిచ్‌ ఆఫీసుల్లోనూ ఉద్యోగులు నిరసన ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని