Raghuram Rajan: వృద్ధి రేటుపై రాజన్‌ వ్యాఖ్యలు సరికాదు.. ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక

హిందు (4-7 దశాబ్దాల క్రితం నాటి) వృద్ధి రేటుకు భారత్‌ మళ్లీ చేరువవుతోందన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలను ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక తోసిపుచ్చింది.

Updated : 08 Mar 2023 09:31 IST

దిల్లీ: హిందు (4-7 దశాబ్దాల క్రితం నాటి) వృద్ధి రేటుకు భారత్‌ మళ్లీ చేరువవుతోందన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలను ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక తోసిపుచ్చింది. ఇటీవలి జీడీపీ, పొదుపు, పెట్టుబడుల  గణాంకాలు ఆధారంగా రాజన్‌ చేసిన వ్యాఖ్యలు తప్పుగా, పక్షపాతంతో చేసినవని పేర్కొంది. రాజన్‌ ఆందోళన వ్యక్తం చేసినంత తీవ్రంగా జీడీపీ వృద్ధి గణాంకాలు లేవని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదికలో పేర్కొంది. ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు మందకొడిగా ఉండటం, అధిక వడ్డీ రేట్లు, అంతర్జాతీయ వృద్ధి నెమ్మదించడం వల్ల భారత వృద్ధిరేటు తగ్గుతోందని రాజన్‌ పేర్కొన్నారు. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.4 శాతానికి నెమ్మదించడం ఆందోళన కలిగిస్తోందని రాజన్‌ అన్నారు. 1950-1980 మధ్య భారత తక్కువ వృద్ధి రేట్లను ‘హిందు వృద్ధి రేటు’గా పరిగణిస్తారు. ఆ సమయంలో సగటు వృద్ధి 3.5 శాతంగా ఉంది. 1978లో ప్రముఖ ఆర్థికవేత్త రాజ్‌ కృష్ణ దీన్ని తక్కువ వృద్ధిగా అభివర్ణించారు.

ఆందోళన అనవసరం: 2022-23లో త్రైమాసికం వారీగా దేశ వృద్దిరేటు తగ్గుతూ వస్తోంది. అయినా కూడా అక్టోబరు- డిసెంబరు త్రైమాసిక గణాంకాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. భారత జీడీపీ వరుసగా మూడో ఏడాదీ సగటున రూ.2 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. గత దశాబ్దంలో పెట్టుబడులు, పొదుపు గణాంకాలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయని ఎస్‌బీఐ గ్రూప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ తెలిపారు.

ప్రభుత్వ గ్రాస్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ 2020-21లో 10.7 శాతం నుంచి 2021-22లో 11.8 శాతానికి వృద్ధి చెందింది. ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు 10 నుంచి 10.8 శాతానికి పెరిగాయని నివేదిక పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని