సంక్షిప్త వార్తలు (5)

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 03:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

పుదుచ్చేరికి ఒలెక్ట్రా విద్యుత్తు బస్సులు 

ఈనాడు, హైదరాబాద్‌: పుదుచ్చేరి రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (పీఆర్‌టీసీ), పుదుచ్చేరి నగర రవాణా వ్యవస్థలో విద్యుత్తు బస్సులు ప్రారంభించింది. దీనికి ఎంఈఐఎల్‌ గ్రూపు సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ 25 బస్సులు అందించింది. ఒలెక్ట్రా విద్యుత్తు బస్సులను ఎంఈఐఎల్‌ గ్రూపునకే చెందిన మరొక సంస్థ ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గ్రాస్‌ కాంట్రాక్టు విధానం (జీసీసీ) కింద 12 సంవత్సరాల పాటు నిర్వహించనుంది. స్మార్ట్‌ సిటీ కార్యక్రమంలో భాగంగా పుదుచ్చేరి నగరంలో విద్యుత్తు బస్సులు ప్రవేశపెడుతున్నారు. ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ సరఫరా చేసిన బస్సుల్లో 15 నాన్‌-ఏసీ, 10 ఏసీ బస్సులు ఉన్నాయి. ఒక్కో బస్సు పొడవు 9 మీటర్లు. ఈ బస్సుల బ్యాటరీని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. 


వయో వృద్ధులకు నివాస సముదాయాలు

ఈనాడు, హైదరాబాద్‌: వయో వృద్ధుల కోసం ప్రత్యేక నివాస సముదాయాల అభివృద్ధికి కొలంబియా పసిఫిక్‌ ఆధ్వర్యంలోని సెరీన్‌ కమ్యూనిటీస్, హైదరాబాద్‌కు చెందిన ప్రతిమా గ్రూపుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో సీనియర్‌ సిటిజన్ల కోసం రెండు ప్రత్యేక గృహ ప్రాజెక్టులను రూ.400 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఇరు సంస్థలు సోమవారం వెల్లడించాయి. తొలి ప్రాజెక్టుగా సెరీన్‌ బిల్వాని వన్‌ను శంకర్‌పల్లిలో నిర్మించనున్నారు. ఇందులో 265 నివాస గృహాలు ఉంటాయి. ధర రూ.60 లక్షల నుంచి ప్రారంభమవుతుందని ప్రతిమా గ్రూపు వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో సీనియర్‌ సిటిజన్ల కోసం సెరీన్‌ కమ్యూనిటీస్‌ నిర్మించిన 10 ప్రాజెక్టుల్లో 1700 నివాసాలున్నాయి.


యాప్, వెబ్‌సైట్‌ ద్వారా విడిభాగాల అమ్మకం: ఓలా 

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ తన వాహనాల విడిభాగాలు, లోపాల గుర్తింపునకు వినియోగించే పరికరాలు, సర్వీస్‌ ట్రైనింగ్‌ మాడ్యూల్స్‌ను దేశవ్యాప్తంగా వినియోగదారులకు, గ్యారేజ్‌లు, మెకానిక్‌లకు అందుబాటులోకి తేనుంది. ఇందుకుగాను హైపర్‌సర్వీస్‌ను ఓపెన్‌ ప్లాట్‌ఫామ్‌గా మారుస్తోంది. సోమవారం నుంచి ఓలా ఎలక్ట్రిక్‌కు సంబంధించి అసలైన విడి భాగాలను ఓలా ఎలక్ట్రిక్‌ కస్టమర్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా కొనుగోలు చేయొచ్చు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి వినియోగదారుడు, గ్యారేజ్, మెకానిక్‌లు అధిక నాణ్యతతో కూడిన సర్టిఫైడ్‌ విడిభాగాలను పొందే వీలుంటుందని కంపెనీ  తెలిపింది. హైపర్‌సర్వీస్‌ మొదటి విడతలో కీలక విడిభాగాలను ఓలా ఎలక్ట్రిక్‌ కస్టమర్‌ యాప్, వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొంది. ఆ తర్వాత పలు విడతల్లో డయాగ్నొస్టిక్‌ పరికరాలు, టెక్నీషియన్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెస్తామని వివరించింది. 


రుబ్రిక్‌తో కాగ్నిజెంట్‌ భాగస్వామ్యం

దిల్లీ: ఉమ్మడి ఖాతాదారులకు బిజినెస్‌ రిసిలియన్స్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (బీఆర్‌ఏఏఎస్‌) అందించేందుకు సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాల సంస్థ రుబ్రిక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్‌ ప్రకటించింది. సైబర్‌ ఘటనలు, రాన్సమ్‌వేర్‌ దాడుల నుంచి సంస్థలు త్వరగా కోలుకోవడానికి, కీలకమైన వ్యాపార లక్ష్యాలను అందుకోవడానికి ఈ సేవలు దోహదపడతాయి. అంతర్జాతీయ కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆవిష్కరణలు, సామర్థ్యాలు, పోటీ ప్రయోజనాల వంటి వాటి కోసం అధునాతన ఏఐ టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు సంస్థలు మొగ్గుచూపుతున్నాయని కాగ్నిజెంట్‌ తెలిపింది. 


పరిశోధనా సామర్థ్య విస్తరణ: సాయి లైఫ్‌ సైన్సెస్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: సాయి లైఫ్‌సైన్సెస్‌ హైదరాబాద్‌లోని తన ఆర్‌ అండ్‌ డీ కేంద్రంలో కొత్తగా సీఎంసీ ప్రాసెస్‌ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబరుకు ఈ కొత్త కేంద్రం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల సాయి లైఫ్‌సైన్సెస్‌కు ఉన్న ప్రాసెస్‌ ఆర్‌ అండ్‌ డీ సామర్థ్యం రెట్టింపవుతుంది. పెప్టైడ్స్, అలిగో ఇంటర్మీడియేట్స్, లింకర్స్‌ అభివృద్ధి చేయగల సామర్థ్యంతో పాటు ఫార్ములేషన్లు ఆవిష్కరించగలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని