RBI: రుణమాఫీ ప్రకటనలు నమ్మి మోసపోవద్దు.. ఆర్‌బీఐ హెచ్చరిక

రుణమాఫీ ప్రకటనల పేరుతో జరుగుతున్న ప్రచారంపై వినియోగదారులను ఆర్‌బీఐ హెచ్చరించింది. వాటిని నమ్మి మోసపోవద్దని సూచించింది.

Published : 11 Dec 2023 16:25 IST

ముంబయి: రుణమాఫీ ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయి. ఈ ప్రకటనలు ఆర్‌బీఐ దృష్టికి రావడంతో.. వాటిని నమ్మొద్దని వినియోగదారులను హెచ్చరించింది.

‘‘రుణమాఫీ ఆఫర్ల పేరుతో కొన్ని సంస్థలు వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సర్వీస్/చట్టపరమైన రుసుము పేరుతో నగదు వసూలు చేసి రుణమాఫీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయి. ఇందుకు ఆయా సంస్థలకు ఎలాంటి అనుమతి లేదు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. దాంతోపాటు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు రుణ మొత్తం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు చెబుతున్నాయి. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అలాంటి సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటం ఆర్థికపరమైన నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ప్రకటనలను వినియోగదారులు నమ్మొద్దు. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి’’ అని ఆర్‌బీఐ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని