Kakinada: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు వెలికితీత

విద్యార్థుల విహారయాత్ర విషాదాన్ని మిగిల్చింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు శనివారం గల్లంతయ్యారు.

Published : 22 Oct 2023 11:52 IST

తాళ్లరేవు: విద్యార్థుల విహారయాత్ర విషాదాన్ని మిగిల్చింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు శనివారం గల్లంతయ్యారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది.. ఆదివారం ఉదయం నలుగురి మృతదేహాలను వెలికితీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.

గోదావరిలో నలుగురు యువకుల గల్లంతు

ప.గో. జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురం ప్రాంతానికి చెందిన ఏడుగురు మూడు ద్విచక్ర వాహనాలపై శనివారం గోపులంక పుష్కరఘాట్‌ వద్దకు చేరుకున్నారు. తన పుట్టినరోజున స్నేహితులతో కలిసి విహారానికి వచ్చిన హనుమకొండ కార్తిక్‌(21) గోదావరిలో స్నానానికి దిగాడు. అతను నీటిలో మునిగిపోతుండడాన్ని ఒడ్టునున్న మిగిలిన ఆరుగురిలో మద్దెన ఫణీంద్ర గణేష్‌(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21)లు గమనించారు. కార్తిక్‌ను రక్షించేందుకు వెంటనే గోదావరిలో దిగారు. వీరు కూడా ప్రవాహానికి కొట్టుకుపోతుండటంతో వారిని ఒడ్డుకు తెచ్చేందుకు సలాది దుర్గామహేష్‌, కొమ్మిరెడ్డి చైతన్య నదిలో దిగారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనక్కి వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వీరితోపాటు వచ్చిన మరో యువకుడు నేదూరు భానుప్రసాద్‌ జరిగిన ఘటనతో భయాందోళన చెంది అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని