Crime News: సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్య

Eenadu icon
By Crime News Desk Updated : 01 Nov 2025 04:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటి ఆవరణలో కత్తులతో పొడిచిన దుండగులు 

చింతకాని, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి ఏపీ రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచి సామినేని రామారావు(73) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున వాకింగ్‌ నుంచి తిరిగొచ్చిన రామారావు తన ఇంటి ఆవరణలోని రేకులషెడ్డులో ఉన్న కోళ్లను బయటకు వదిలేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేసినట్లు ఘటనా స్థలంలో ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది.

రామారావు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే ఆయన రక్తపు మడుగులో కనిపించారు. ఘటనా స్థలాన్ని ఖమ్మం సీపీ సునీల్‌దత్‌ పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ ఊరి చివర ఉన్న పల్లె ప్రకృతివనం వరకూ వెళ్లి ఆగింది. హత్య రాజకీయంగా జరిగిందా..? ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా..? అని పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త రామారావు హత్యలో గ్రామానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్‌ నాయకుల ప్రమేయం ఉందని అనుమానిస్తూ మృతుడి భార్య స్వరాజ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మధిర నియోజకవర్గం పాతర్లపాడులో సీపీఎం సీనియర్‌ నాయకుడు హత్యకు గురికావడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌ ఆరోపించారు.

Tags :
Published : 01 Nov 2025 03:36 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు