మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్‌

ఆర్కిటెక్ట్‌ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్‌ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్‌ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు.

Updated : 18 May 2024 07:09 IST

ఆపై బ్యాంకుకు పంపి రూ.60 లక్షలు బదిలీ చేయించుకున్న సైబర్‌ మోసగాడు
ఫిర్యాదుతో సత్వరం స్పందించి సొమ్మును నిలిపివేయించిన సీఎస్‌బీ

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్కిటెక్ట్‌ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్‌ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్‌ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. తరువాత వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఆమెను బ్యాంకుకు పంపి రూ.60 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. కానీ బాధితురాలు వెంటనే తేరుకొని ఫిర్యాదు చేయడంతో స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) పోలీసులు డబ్బులు డ్రా కాకుండా నిలువరించారు. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నివసించే మహిళకు ఈ నెల 15న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకొని.. మీరు మనీలాండరింగ్‌ కేసులో ఇరుక్కున్నారని, అరెస్టు వారెంట్‌ జారీ అయిందని ఆమెను బెదిరించాడు. భయాందోళనకు గురైన బాధితురాలు తనను కాపాడమని కోరారు. ఇదే ఆసరాగా స్కైప్‌లో వీడియోకాల్‌ చేసిన ఆగంతకుడు పలు విధాలుగా ఆమెను భయపెట్టాడు. వాష్‌రూంకు కూడా వెళ్లనీయకుండా మరుసటి రోజు ఉదయం బ్యాంకు తెరిచే సమయం వరకు వీడియోకాల్‌ ఆన్‌లోనే ఉంచేలా చేశాడు. ఆపై కేసును కొట్టేసేలా చేస్తానంటూ ఆమెను బ్యాంకుకు పంపించి పలు ఖాతాలకు రూ.60 లక్షలు బదిలీ చేయించుకున్నాడు.

ఈ తతంగం ముగిసే వరకు కూడా వీడియోకాల్‌ కొనసాగిస్తూనే ఉండేలా ఒత్తిడి చేయడం గమనార్హం. కొంతసేపటికే తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు ఇచ్చారు. అప్రమత్తమైన సీఎస్‌బీ బృందం ఆన్‌లైన్‌ లావాదేవీల వివరాల్ని సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌)లో నమోదు చేయించారు. అలాగే ఎస్‌బీఐ ఖాతాలకు నగదు బదిలీ కావడంతో ఆ బ్యాంకు ప్రతినిధులనూ అప్రమత్తం చేశారు. ఈ ప్రక్రియనంతా గంటలోపే ముగించడంతో ఆయా ఖాతాల నుంచి నగదును ఎవరూ ఉపసంహరించకుండా నిలిపివేయించారు. దీంతో బాధితురాలు ఊపిరి పీల్చుకున్నారు. సైబర్‌ నేరస్థులు సొమ్ము కొట్టేసినా.. సత్వరం ఫిర్యాదు చేస్తే వెనక్కి తీసుకురావొచ్చని సీఎస్‌బీ మరోసారి నిరూపించింది. ఇటీవలే రూ.కోటి కొట్టేస్తే 25 నిమిషాల్లోనే స్పందించి నిందితులకు చేరకుండా ఆపివేయించిన ఘటన తెలిసిందే. ఈ సందర్భంగా సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయెల్‌.. ఎస్సై శిరీష, కానిస్టేబుళ్లు రెహమాన్, కృష్ణలను అభినందించారు. పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థల ప్రతినిధులెవరూ వీడియోకాల్‌ లేదా స్కైప్‌ కాల్‌ చేసి డబ్బులు అడగరని, అలా ఎవరైనా ఫోన్‌ చేస్తే.. 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు