అమ్మానాన్నలే హంతకులయ్యారు

అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే కుమార్తెను హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు.

Updated : 20 May 2024 07:23 IST

కుమార్తెకు మానసిక సమస్య
ఎంత ప్రయత్నించినా నయం కాకపోవడంతో .. నిద్రిస్తుండగా హత్యచేసిన తల్లిదండ్రులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన.. దంపతుల అరెస్టు

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే కుమార్తెను హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదివారం చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య-ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక(25) గత ఏడు సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమెను ఆసుపత్రులు, దేవాలయాల వద్దకు తీసుకెళ్తూ చాలా డబ్బు ఖర్చు చేశారు. కొంతవరకు వ్యాధి నయం కావడంతో 2020లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గాపల్లికి చెందిన పృథ్వీతో వివాహం చేశారు. వారు కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఉంటున్నారు. వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు.

నెల రోజులుగా ప్రియాంక మునుపటి లాగే మానసిక వ్యాధితో బాధపడుతూ అందరిని ఇబ్బంది పెడుతోంది. చుట్టుపక్కల వారిని దూషించడం, గొడవలు పెట్టుకోవడంతో భర్త.. ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజులు ఉంచారు. నయం కాకపోవడంతోపాటు ఆమె ప్రవర్తనను చూసి తల్లిదండ్రులు విసిగిపోయారు. నేరెల్లకు తీసుకొచ్చి ఈ నెల 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హత్య చేశారు. 15న అత్తగారి గ్రామం దర్గాపల్లికి తీసుకెళ్లి చేతబడి వల్ల మరణించిందని చెప్పి నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై నేరెల్ల గ్రామస్థులకు అనుమానం రావడంతో డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా తల్లిదండ్రులే హత్య చేసినట్లు తేలడంతో స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు నుంచి ఫిర్యాదు తీసుకొని వారిని ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని