నీట్‌ ర్యాంకు ఇప్పిస్తామన్న మోసగాళ్ల అరెస్టు

Eenadu icon
By Crime News Desk Updated : 15 Jun 2025 05:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: నీట్‌-యూజీ 2025 ఫలితాల్లో మార్కులు పెంచి మెరిట్‌ ర్యాంకులు వచ్చేలా చేస్తామని పలువురు అభ్యర్థులు, వారి తల్లిదండ్రులను మోసగించిన ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో మహారాష్ట్రలోని శోలాపుర్‌కు చెందిన సందీప్‌ షా, నవీ ముంబయికి చెందిన సలీం పటేల్‌లను అరెస్టు చేశామని, ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మరో నిందితుడి కోసం సీబీఐ గాలిస్తోందని శనివారం అధికారులు తెలిపారు. ‘‘జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) అధికారులతో తమకు సంబంధాలు ఉన్నాయని, వారి ద్వారా నీట్‌ ఫలితాల్లో మెరిట్‌ ర్యాంకులు వచ్చేలా చేస్తామని చెప్పి వీరు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.90 లక్షలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ముంబయిలోని ఓ హోటల్‌లో రహస్య సమావేశాలు నిర్వహించారు.

ఇందులో బేరసారాల తర్వాత ఒక్కో అభ్యర్థికి ర్యాంకు కోసం రూ.87.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులను సీబీఐ అరెస్టు చేసి, వారి ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించగా.. అందులో అభ్యర్థుల పేర్లు, వారి హాల్‌టికెట్‌ నంబర్లు, ఓఎంఆర్‌ షీట్ల వంటి చాటింగ్‌ వివరాలు, హవాలా ఆర్థిక లావాదేవీల ఆధారాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో నిందితులను ఇటీవల ప్రత్యేక కోర్టు సమక్షంలో పెట్టారు. కోర్టు వారిని ఈ నెల 16 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. మరోవైపు నిందితులతో ప్రభుత్వ, ఎన్‌టీఏ అధికారులకు ఎలాంటి సంబంధాలు లేవని విచారణలో తేలిందని అధికారులు చెప్పారు.

Tags :
Published : 15 Jun 2025 04:10 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు