Crime News: ఎండీ, సీఈవో హత్య.. ఆపై ఇన్‌స్టాలో పోస్టులు..

బెంగళూరులో ఓ కంపెనీ ఎండీ, సీఈవో హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కావడం గమనార్హం. 

Updated : 12 Jul 2023 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  బెంగళూరు(Bengaluru)కు చెందిన ఓ కంపెనీ ఎండీ, సీఈవోను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ కంపెనీని వీడి కొత్త కంపెనీ పెట్టిన మాజీ ఉద్యోగులే ఈ హత్య చేసినట్లు తేలింది. తమ కొత్త కంపెనీ కస్టమర్లను, ఉద్యోగులను లాక్కొంటున్నారనే అక్కసుతోనే వారిని చంపినట్లు అంగీకరించారు. హంతకుల్లో ఒకడు.. హత్య అనంతరం ఇన్‌స్టాలో పోస్టులు చేయడం గమనార్హం. నగరంలోని అమృతహళ్లి పంపా లేఅవుట్లోని ‘ఎయిర్‌ ఆన్‌ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌’ సీఈఓ వినుకుమార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫణీంద్ర సుబ్రహ్మణ్య మంగళవారం సాయంత్రం హత్యకు గురయ్యారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను శబరీష్‌, వినయ్‌రెడ్డి, సంతోష్‌గా గుర్తించారు. నిందితులంతా ఎయిర్‌ ఆన్‌లో మాజీ ఉద్యోగులు కావడం గమనార్హం.

మృతులు ఫణీంద్ర, వినుకుమార్‌ల కంపెనీ ఇంటర్నెట్‌ సేవలు అందిస్తుంది. ఆ  కంపెనీలోనే నిందితులు గతంలో పనిచేశారు. ఆ తర్వాత వారు సదరు కంపెనీకి రాజీనామా చేసి సొంతంగా మరో సంస్థను ఏర్పాటు చేసుకొన్నారు. నిందితుల్లో శబరీష్‌ తన పేరును జాక్‌ ఫిలిక్స్‌గా చెప్పుకొనేవాడు. శబరీష్‌ కొత్త కంపెనీలోని పలు లోపాలపై ఫణీంద్ర మాట్లాడేవాడు. దీంతో పాటు వారి కస్టమర్లను, ఉద్యోగులను లాక్కొనేందుకు యత్నించాడని ఫణీంద్రపై కక్ష పెంచుకొన్నాడు శబరీష్‌. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద కత్తి తీసుకొని ఫణీంద్రను అతడి కంపెనీలోనే హత్య చేశాడు. అరుపులు వినిపించడంతో వినుకుమార్‌ అక్కడికి చేరుకొన్నాడు. దీంతో శబరీష్‌ అతడిపై కూడా దాడి చేసి హతమార్చాడు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

హత్యల అనంతరం ఇన్‌స్టాలో పోస్టులు..

జాక్‌ ఫిలిక్స్‌ సామాజిక మాధ్యమాల్లో తనను తాను కన్నడ ర్యాపర్‌గా చెప్పుకొన్నాడు. అతడికి దాదాపు 16 వేల మంది ఫాలోవర్లున్నారు. ఈ జంట హత్యల తర్వాత ఇన్‌స్టాలో పోస్టులు చేయడంలో బిజీగా గడిపాడు. హత్యల్లో తన ప్రమేయంపై వచ్చిన టీవీ వార్త స్క్రీన్‌ షాట్‌ను కూడా పోస్టు చేశాడు. ఈ హత్యకు ముందు కూడా ‘‘ఈ ప్రపంచం మొత్తం మోసగాళ్లు, కపట పొగడ్తలు చేసేవారితో నిండిపోయింది. నేను ఈ భూమిపై వారిని శిక్షిస్తాను. మంచి వారిని ఎప్పుడూ ఏమీచేయను’’ అని పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని