Road Accident: పెదకాకాని వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు-టాటా ఏస్‌ వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు.

Updated : 11 Jun 2024 09:37 IST

పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు-టాటా ఏస్‌ వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న సిమెంట్‌ రెడీమిక్స్‌ వాహనం.. పెదకాకానిలోని అమెరికన్‌ అంకాలజీ క్యాన్సర్‌ ఆసుపత్రి ఎదుట మరమ్మతులకు గురైంది. దీంతో డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డుకు కుడివైపున నిలిపాడు. ఆగి ఉన్న ఈ వాహనాన్ని గమనించకపోవడంతో వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో రెడీమిక్స్‌ వాహనం రోడ్డు మధ్యకు జరిగింది. ఇదే సమయంలో వెనుకవైపు నుంచి కూలీలతో వస్తున్న టాటాఏస్‌ ఆ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటాఏస్‌లో ఉన్న పేరేచర్ల గ్రామానికి చెందిన కె.రాంబాబు(40), గుంటూరు నగరానికి చెందిన తేజ(21) అక్కడికక్కడే మృతి చెందారు. పాత గుంటూరుకు చెందిన డి.మధు(25) జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలంకరణ పనులకు వెళ్లి వస్తున్న కూలీలు మరికొద్ది సమయంలో ఇంటికి చేరతామనే లోపే ఈ ప్రమాదం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని