Crime: తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్‌కు నిప్పంటించిన కుటుంబసభ్యులు

తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Published : 18 May 2024 00:07 IST

పట్నా: తప్పిపోయాడనుకున్న మూడేళ్ల చిన్నారి మృతదేహం అతను చదువుతున్న స్కూల్‌ తరగతి గది ఆవరణలో లభ్యమైన ఘటన పట్నాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్కూల్‌కు వెళ్లిన తమ పిల్లాడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. తమకేమీ తెలియదని యాజమాన్యం ఆ విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నించారు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు స్కూల్‌లో వెతుకుతుండగా తరగతి గది ముందున్న ఆవరణలో దాచి ఉంచిన చిన్నారి మృతదేహం లభ్యమైంది. తమ చిన్నారి ప్రాణాలు లేకుండా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిన్నారి పాఠశాలలోకి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయని, స్కూల్‌ అయ్యాక విద్యార్థి బయటకు రాలేదని వారు పేర్కొన్నారు. పాఠశాల సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే చిన్నారి మృతదేహాన్ని దాచిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతోందన్నారు.

చిన్నారి మృతితో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు ఆ పాఠశాలకు చెందిన పలు వాహనాలు, తరగతి గదులకు నిప్పు పెట్టారు. సత్వర న్యాయం కోరుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని