Crime news: దేవుడి కోసం ఆత్మ బలిదాన యత్నం.. చెట్లు నరికే యంత్రంతో తల కోసుకున్నాడు!

మూఢ భక్తితో ఓ వ్యక్తి తన ప్రాణాలను అర్పించుకునే ప్రయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Published : 15 Aug 2023 17:32 IST

లఖ్‌నవూ : దేవుడికి నైవేద్యంగా తన తల సమర్పించడానికి యత్నించి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలోని లలిత్‌పుర్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దీపక్‌ కుశ్వాహా అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దేవుడి భక్తుడిగా చెప్పుకొంటూ దీపక్‌ వివిధ రకాల పూజలు నిర్వహించేవాడు. గత కొన్ని నెలలుగా అతడు తన శిరస్సును బలి ఇచ్చి దేవుణ్ని ప్రసన్నం చేసుకుంటానని తెలిసినవారితో చెబుతూ వచ్చాడు. తన అర్పణ, దేవుని ప్రార్థనల గురించి ఓ నోట్‌బుక్‌ సైతం రాసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దీపక్‌ తండ్రి పాల్తూరామ్ ఆత్మ బలిదానం పిచ్చిపని అని ఓ రోజు మందలించాడు. అయినా వినకుండా తనకు యాగం చేయాలని ఉందని నెలరోజులుగా తండ్రికి చెబుతూ వచ్చాడు.  

స్కూల్ బస్సు బోల్తా.. 9 మంది విద్యార్థులకు గాయాలు

ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున స్థానిక ఆలయానికి దీపక్‌ వెళ్లాడు. హోమగుండం ఎదుట నిల్చొని దేవుణ్ని స్తుతిస్తూ తన వెంట తెచ్చుకున్న చెట్లు నరికే యంత్రంతో తల కోసుకునేందుకు యత్నించాడు. అరుపులు విన్న స్థానికులు పరిగెత్తుకుంటూ గుడిలోకి వెళ్లారు. అప్పటికే అతడు రక్తపు మడుగులో కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఝాన్సీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ప్రస్తుతం దీపక్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని