logo

వారాంతపు సెలవులు హుష్‌ఖాకీ

జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు..

Updated : 30 Apr 2024 06:26 IST

అమలు మరచిన జగన్‌
ఒత్తిడితో విగతజీవులవుతున్న పోలీసు సిబ్బంది
వాడుకుని వదిలేసిన వైకాపా సర్కార్‌

  • చిత్తూరుకు చెందిన ఓ కానిస్టేబుల్‌ ఇటీవల ఒత్తిడి కారణంగా గుండెపోటుతో మృతి చెందారు. జిల్లా అధికారులు ఆ కుటుంబాన్ని పరామర్శించి పరిహారం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని కనీసం సమీక్షించకపోవడం గమనార్హం.
  • చిత్తూరులో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాత్రి విధుల్లో ఉన్న అతడికి నిద్ర లేమి, ఒత్తిడి కారణంగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఆ కుటుంబానికి జిల్లా అధికారులు ప్రభుత్వపరంగా సాయం అందజేశారు. ఈ ఘటన తర్వాత కూడా కనీస సమీక్ష లేదు.

చిత్తూరు జిల్లా సాయుధ పోలీసు కార్యాలయం

చిత్తూరు(నేరవిభాగం), పుత్తూరు, న్యూస్‌టుడే: జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. కొందరు తమిళనాడులోని వేలూరు సమీపంలోని బంగారుగుడిని రోడ్డు మార్గంలో వెళ్లి దర్శిస్తుంటారు.. ఈ నేపథ్యంలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.. స్టేషన్‌ విధులతో పాటు వీఐపీలు వచ్చినప్పుడు అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహించాల్సిందే.. దీంతో కుటుంబాలకు దూరమై ఒత్తిడికి గురవుతున్నారు.

ఆధ్యాత్మిక కేంద్రాల ఖిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పని చేయాలంటే పోలీసులకు ఓ సవాలే. సిబ్బంది గుండెపోటుకు గురై మృతి చెందడం, పలువురు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ప్రధాన కారణమైన విధుల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు వారాంతపు సెలవులు ఇస్తామని, బందోబస్తు సమయంలో ప్రత్యేక భత్యాలు ఇస్తామని, న్యాయమైన పీఆర్సీ అందజేస్తామని.. సీఎం జగన్‌ జిల్లాలో నాటి పాదయాత్రలో పలుమార్లు హామీలు గుప్పించారు. అవేమీ నెరవేరలేదు. ఫలితంగా విధి నిర్వహణలో ఒత్తిడి తదితర కారణాలతో సిబ్బంది ప్రాణాలు కోల్పోయి తమ కుటుంబాలకు తీ‌్ర÷రని వేదన మిగుల్చుతున్నారు.

సిబ్బంది ఇలా..

జిల్లాలో ప్రస్తుతం డీఎస్పీలు ఆరుగురు, సీఐలు 28 మంది, ఎస్‌ఐలు 50, ఏఎస్‌ఐలు 105, హెడ్‌కానిస్టేబుల్‌ 254 మంది, పోలీసు కానిస్టేబుల్స్‌ 643 మంది ఉన్నారు. ఇక ఆర్మ్‌డ్‌ రిజర్వులో డీఎస్పీ ఒకరు, ఆర్‌ఐలు ఇద్దరు, ఆర్‌ఐఎస్‌లు ఐదుగురు, ఏఆర్‌హెచ్‌సీలు 99, ఏఆర్‌పీసీలు 212 మంది ఉన్నారు. ఇంకా బ్రిటీష్‌ హయాం నాటి సంఖ్యే నేటికీ సిబ్బంది విషయంలో కొనసాగుతోంది. ఉన్న సిబ్బందితోనే రాత్రి విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో స్టేషన్‌ విధుల్లో ఉన్నవారు నెలకు పది రోజులు రాత్రి విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం నెలలో 15 రోజులు పాటు విధిగా రాత్రి డ్యూటీలు చేయాల్సిందే. రోజు మార్చి రోజు రాత్రి విధులు నిర్వర్తించాలంటే కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ వారాంతపు సెలవులు ఇస్తామని ప్రకటించారు. నాటి డీజీపీ గౌతం సవాంగ్‌ కమిటీ వేసి.. వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ మేరకు నెల రోజులు వారాంతపు సెలవులు ఇచ్చారు. ఆపై ప్రస్తుతం ఉన్న సిబ్బందితో వారాంతపు సెలవులు ఇవ్వడం కుదరదని రద్దు చేశారు.

వీఆర్‌ఎస్‌ తీసుకోలన్నా.. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచింది. అందులో భాగంగా పోలీసులకూ ఇది వర్తిస్తుంది. 58 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేసిన పలువురు పోలీసు అధికారులు సిబ్బంది కుటుంబంతో హాయిగా ఉన్నారని పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ ఉద్యోగి పేర్కొన్నారు. విధుల్లో ఉన్న వారే అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారన్నారు. ఒకవేళ వీఆర్‌ఎస్‌ తీసుకున్నా ప్రభుత్వం బాండ్లు ఇస్తుండటంతో  సుముఖంగా లేరని పేర్కొన్నారు. అప్పటికప్పుడు సెటిల్‌మెంట్‌ చేస్తే పలువురు సిద్ధంగా ఉన్నారని పేర్కొనడం గమనార్హం.

పెరిగిన పని ఒత్తిడి..

జిల్లాలో పోలీసులకు కుటుంబంతో సరదాగా విహారయాత్రలకు వెళ్లాలన్నా సెలవు దొరకని పరిస్థితి. వారికున్న సీఎల్‌లు సైతం మిగిలిపోతున్నాయి. వీఐపీల తాకిడితో అదనపు విధులు నిర్వర్తించాలి. ఈ విధులకు సంబంధించి ప్రత్యేక భత్యాలు, ప్రయాణ భత్యాలు ఇవ్వాల్సి ఉన్నా  ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని