logo

నిర్మాణాలు వేగవంతం.. సమస్యలు దూరం

తాండూరు పట్టణం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సెంట్‌మార్క్స్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాల వరకు రోడ్డు విస్తరణతో పాటు కాలువ నిర్మాణాన్ని రహదారులు భవనాల శాఖ చేపడుతోంది.

Published : 28 May 2024 02:49 IST

తాండూరులో రూ.25 కోట్లతో రోడ్లు, కాలువల విస్తరణ 

తుది దశలో కాలువ పైకప్పు 

న్యూస్‌టుడే, తాండూరు, తాండూరు టౌన్‌: తాండూరు పట్టణం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సెంట్‌మార్క్స్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాల వరకు రోడ్డు విస్తరణతో పాటు కాలువ నిర్మాణాన్ని రహదారులు భవనాల శాఖ చేపడుతోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసింది. ఇటీవలే పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కాలువ నిర్మాణం ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం నుంచి కొనసాగితే రహదారి విస్తరణ పనులు పాఠశాల వైపు నుంచి కొనసాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్, ఇతర సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.

గతంలో రూ.22కోట్లతో పనులు: గతేడాది తాండూరు, కొడంగల్‌ పట్టణాల్లో 9 కి.మీటర్ల పొడవునా నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులను రూ.22 కోట్లతో నేషనల్‌ హైవే అథారిటీ చేపట్టింది. ఇందులో తాండూరులో ఒక వైపు నుంచి 6 కిలో మీటర్ల రోడ్డు, 5 కిలో మీటర్ల పొడవునా వరద కాలువ నిర్మాణం చేపట్టింది.. తాజాగా నేషనల్‌ హైవే అథారిటీ జాతీయ రహదారి నిర్మాణాన్ని తాండూరు పట్టణం మీదుగా కాకుండా తాండూరు మండలం అల్లాపూరు నుంచి కాగ్నానది వద్ద కొత్తగా నిర్మించే వంతెన వరకు చేపడుతోంది. దీన్ని బైపాస్‌ రోడ్డుగా పరిగణించింది. అయితే ఇది వరకు తాండూరు పట్టణంలో నిర్మించిన రహదారిని రహదారులు, భవనాల శాఖ పరిధిలోకి మార్చారు. దీంతో రోడ్డుకు ఒక వైపున పెండింగులో ఉన్న కాలువల నిర్మాణం, రహదారి విస్తరణ పనులను రహదారులు, భవనాల శాఖ చేపడుతోంది. దీంతో వర్షాకాలంలో నీరు నిలిచి ఇబ్బందులు పడే అవస్థలు తొలగుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.

14.5 అడుగుల వెడల్పుతో విస్తరణ: తాండూరులో ఇది వరకు నిర్మాణమైన రోడ్డకు ఒక వైపు నుంచి 14.5 అడుగుల వెడల్పు చొప్పున రహదారి నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రస్తుతం విస్తరించాల్సిన రహదారి మట్టిదిబ్బలతోనే ఉంది. మధ]్యలో విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు ఉన్నాయి. వీటిని తొలగించి తారు రహదారి నిర్మించాలి. ఇది జరిగితేనే పట్టణంలోని రోడ్డు నాలుగు వరుసలుగా మారుతుంది. వాహనాల రాకపోకలు సౌకర్యంగా సాగుతాయి.

వీలున్న చోట పనులు జరుగుతున్నాయి

తాండూరు పట్టణంలో ప్రస్తుతం అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లోనే పనులు చేపడుతున్నాం. విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు, ఇతర కట్టడాలు లేని చోట కాలువల నిర్మాణం జరుగుతోంది. రహదారి విస్తరణకు కంకర పరిచే పనులు ప్రారంభమయ్యాయి. వర్షాలు కురిస్తే తారును వేయడం కుదరదు. కాలువ పనులు మాత్రం యథాతథంగా కొనసాగిస్తాం.

శ్రీనివాస్, డీఈఈ, రహదారులు, భవనాల శాఖ, తాండూరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని