Andhra News: ఆ 100 ఎకరాలు కొన్నా.. కావాలంటే ఇచ్చేస్తా: మంత్రి జయరామ్‌

రైతులు ఇట్టినా కంపెనీకి విక్రయించిన భూముల్లో 100 ఎకరాలు తానే కొనుగోలు చేశానని ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ ప్రకటించారు. 

Updated : 21 Dec 2022 18:04 IST

ఆలూరు: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఇట్టినా కంపెనీకి 2006లో రైతులు విక్రయించిన భూముల్లో 100 ఎకరాలు తానే కొనుగోలు చేశానని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెలిపారు.  తాను కొనుగోలు చేసిన భూముల్లో రైతులవి ఉంటే .. వాటిని మార్కెట్‌ ధరకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని ప్రకటించారు. ఆస్పరిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన మంత్రిని .. ఇట్టిన కంపెనీకి భూములు విక్రయించిన రైతులు, సీపీఎం నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.  అనంతరం అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సీఎం జగన్‌ జన్మదిన వేడుకల్లో మంత్రి జయరామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇట్టినా కంపెనీ నుంచి తాను కొనుగోలు చేసిన 100 ఎకరాలలో రైతుల భూములు ఉంటే వారికి మార్కెట్‌ ధర ప్రకారం విక్రయిస్తానని ప్రకటించారు. రైతుల భూములు వారికే ఇచ్చేస్తానన్న మంత్రి ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు.

గతంలోనే ఐటీ నోటీసులు

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, ఆయన భార్య రేణుకమ్మతో పాటు, ఆలూరు సబ్‌ రిజిస్ట్రార్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రేణుకమ్మ పేరుతో ఆస్పరి మండలం చిన్నహోతురు, ఆస్పరిలో 30.83 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి ఐటీశాఖ అక్టోబరు 30న మంత్రి జయరాం, రేణుకమ్మ, ఆలూరు సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ భూమి కొనుగోలు చేసేందుకు మంత్రి జయరాం డబ్బులు చెల్లించారని ఐటీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 30.83 ఎకరాల భూమికి రూ.52.42లక్షలు చెల్లించారని, దీన్ని బినామీగా పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న 90 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇట్టినా కంపెనీ నుంచి కొనుగోలు చేసిన భూములను రైతులకు విక్రయిస్తానని మంత్రి చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని