AP CID: చంద్రబాబు బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్‌

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

Updated : 21 Nov 2023 19:29 IST

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్టు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పు న్యాయసమ్మతం, చట్ట సమ్మతం కాదని పొన్నవోలు అన్నారు. చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వటం దురదృష్టకరమన్నారు. స్కిల్‌ కేసులో అవకతవకలపై తగిన సాక్ష్యాధారాలు సమర్పించినా హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు.

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు(Chandrababu) సోమవారం హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. చంద్రబాబు, తెదేపా ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు తెదేపా ఖాతాలోకి చేరాయనేందుకు దర్యాప్తు సంస్థ (సీఐడీ) వద్ద ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని