CM Revanth reddy: టీఎస్‌పీఎస్సీ నియామకాలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీ అంశానికి సంబంధించిన వివరాలు, కేసు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుసుకున్నారు.

Updated : 12 Dec 2023 21:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీ అంశానికి సంబంధించిన వివరాలు, కేసు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలుసుకున్నారు. టీఎస్‌పీఎస్సీపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీసులు ఉన్నతాధికారులు, కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు.. ఛైర్మన్‌ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాలపై రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. (TSPSC)

కమిషన్‌ ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. గ్రూప్‌-1, ఏఈఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సీఎం అడిగి తెలుసుకున్నారు. కేసు పురోగతి, ఇప్పటివరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణ సహా అన్ని అంశాల గురించి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా వివరాలు తీసుకున్నారు. ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిస్థితులకు అనుగుణంగా కమిషన్‌ తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి..

టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. యూపీఎస్సీ విధానంపై, ఇతర రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీసు కమిషన్లపై సమగ్ర అధ్యయనం చేసి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకాలు పారదర్శకంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్‌ ఏర్పాటు ఉండాలన్నారు. పది, ఇంటర్‌ పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు వర్సీటీల పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ జూనియర్‌ కాలేజీలు అవసరమో నివేదిక ఇవ్వాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు