Revanth Reddy: తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌

తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ అని.. ఇక్కడి ప్రజలు బానిసత్వాన్ని భరించరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 02 Jun 2024 12:42 IST

హైదరాబాద్‌: తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ అని.. ఇక్కడి ప్రజలు బానిసత్వాన్ని భరించరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని చెప్పారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని వివరించారు. ఇందిరా పార్కులో ధర్నాలకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు. తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్‌ విడుదల చేశారు. తెలంగాణ డ్రీమ్‌- 2050 మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని చెప్పారు.

‘‘తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ఉండాలని అనుకున్నాం. ఇప్పుడు  రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటిస్తున్నాం. జాతి చరిత్రకు అద్దంపట్టేదే రాష్ట్ర చిహ్నం. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది అందులోనే. సూచనలకు అనుగుణంగా నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్‌ను.. టీజీగా మార్చాం. సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలి’’ అని రేవంత్‌ అన్నారు.

మూడు జోన్లుగా తెలంగాణ

తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ, ఓఆర్‌ఆర్‌ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాంతం వరకు సబ్‌ అర్బన్‌ తెలంగాణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని తెలిపారు. త్వరితగతిన రీజినల్‌ రింగు రోడ్డు పూర్తిచేస్తామన్నారు.

‘‘తాలు, తరుగు లేకుండా ధాన్యం కొంటున్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటున్నాం. రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లు జమ చేశాం. మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని చేపడతాం. దీనికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. ప్రజల అవసరాలకు తగినట్లు మెట్రో విస్తరణ జరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఇచ్చే ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. డ్రగ్స్‌, గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఈ అంశంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10లక్షలకు పెంపును అమలు చేశాం. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఈ ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ.22,500కోట్లు కేటాయించాం. మండల కేంద్రాల్లో అంతర్జాతీయ మోడల్‌ స్కూళ్ల నిర్మాణం మా బాధ్యత. స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని